నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 19 : జిల్లావ్యాప్తంగా నెలకొల్పిన వినాయక విగ్రహాలు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్నాయి. వినాయక శోభాయాత్ర, నిమజ్జనం ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. అంతకుముందు మండపాల వద్ద అన్నదానం చేశారు. శోభాయాత్రలో చిన్నారులు, యువతులు చేసిన దాండియా, యువకుల నృత్యాలు అలరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, రెవెన్యూ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు.
నిజాంసాగర్ మండలంలోని కోమలంచ, పెద్దకొడప్గల్ గ్రామంలో ఆదివారం నిమజ్జనం నిర్వహించారు. చంద్రమౌళీశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ఆదివారం నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి. ఎస్సై విజయకొండ బందోబస్తు చర్యలు చేపట్టారు. పిట్లం మండలకేంద్రంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద లడ్డూ వేలం నిర్వహించారు. పిట్లం గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాస్ రూ.30,011కు లడ్డూను దక్కించుకున్నారు. నాగిరెడ్డిపేట మండలం బంజారా తండాలో గిరిజనులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. లింగంపేట మండలంలోని ఒంటర్పల్లిలో వేలం నిర్వహించగా.. గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి లడ్డూను రూ.23,111కు, ఆపిల్ పండును కృష్ణారెడ్డి రూ.7,001కు దక్కించుకున్నారు.
వినాయక ఆలయంలో టీఆర్ఎస్ నాయకుల పూజలు..
బాన్సువాడ, సెప్టెంబర్ 19 : పాత బాన్సువాడ వినాయకనగర్కాలనీలో ఉన్న వినాయక ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రత్యేకపూజలు, పల్లకీసేవ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బుడ్మి సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, కౌన్సిలర్ లింగమేశ్వర్ , ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్లో నిర్వహించిన శోభాయాత్రలో తహసీల్దార్ రాజు, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం కోలాటం ఆడి ఆకట్టుకున్నారు.
అడ్లూర్ ఎల్లారెడ్డి వద్ద నిమజ్జనాన్ని పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 19 : అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో వినాయక నిమజ్జన ప్రక్రియను కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆదివారం ఉదయం, ఎస్పీ శ్వేతారెడ్డి రాత్రి వేళ పరిశీలించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంతోపాటు సమీప గ్రామాల వినాయకుల నిమజ్జనం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్పీ పరిశీలించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని 262 విగ్రహాలను అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, కమిషనర్ దేవేందర్, తహసీల్దార్ ప్రేమ్కుమార్ ఉన్నారు.
శోభాయాత్రను అడ్డుకున్న వారిపై ఫిర్యాదు..
తాడ్వాయి, సెప్టెంబర్ 19 : మండల పరిధిలోని నందివాడ గ్రామంలో శనివారం మధ్యాహ్నం వినాయక నిమజ్జన శోభాయాత్రను కొంతమంది అడ్డుకున్నారు. ఈ విషయంపై శోభాయాత్ర నిర్వహిస్తున్న వ్యక్తులు ఏఎస్సై సంజీవ్రావుకు ఫిర్యాదు చేశారు.