నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 18 : ఉమ్మడి జిల్లా జ్యుడీషియల్ న్యాయ విచారణలో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్పోలియో జడ్జి కె.లక్ష్మణ్ అన్నారు. కరోనా మహమ్మారి విలువైన కాలాన్ని న్యాయార్తులకు, న్యా యవ్యవస్థకు దూరం చేసిందని, దానిని పూడ్చుకోవడానికి శ్రమించాలని సూచించారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాలులో న్యాయాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత కేసులకు ప్రాధాన్యం ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కొత్తగా నమోదైన కేసులను కక్షిదారులు, న్యాయవాదుల అభీష్టం మేరకు ఉత్తర్వులు ఇవ్వాలన్నా రు. న్యాయాధికారులకు దిశా నిర్దేశం చేశారు. న్యాయస్థానాల్లో మౌలిక వసతులు, వివిధ న్యా యస్థానాల్లో కేసుల వివరాలు, వాటి స్థితిగతులను ఉమ్మడి జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి తెలియజేశారు.
సీనియర్ల మార్గదర్శకంలో ముందుకు
సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు మార్గదర్శకులుగా ముందుండి నడిపించాలని హైకోర్టు జడ్జి లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. నిరంతర అధ్యయనం, కష్టపడేతత్వం న్యాయవాదుల నిత్య వృత్తి జీవనంలో పాటించాలని సూచించారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ బార్ అసోసియేషన్లు సమర్పించిన వినతులను సానుకూలంగా స్పందించి పరిష్కారమయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తానన్నారు. చట్టాల, న్యాయస్థానాల తీర్పుల నిరంతర అధ్యయనమే న్యాయవాదులకు పెట్టని కోటలుగా పనికి వస్తాయని ఉద్బోధించారు.
న్యాయవాద వృత్తి నైపుణ్యాలు కీలకం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటుచేసిన ‘న్యాయవాదులు – న్యాయపరమైన నైపుణ్యాలు’ అనే అంశంపై రెండురోజుల శిక్షణా తరగతులను న్యాయ సేవాసదన్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. న్యాయవాద వృత్తిలో న్యాయపరమైన నైపుణ్యాలు కీలకమని, న్యాయ సేవా సంస్థ ప్యానల్ న్యాయవాదులు సంస్థకు సేవాభావంతో పని చేయాలని, సామాన్యుడికి న్యాయ సేవలు అందించడంలో అగ్రభాగాన నిలవాలన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు గౌతంప్రసాద్, షౌకత్ జహన్ సిద్ధిఖీ, పంచాక్షరి, సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజరెడ్డి పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్స్ రాజ్కుమార్ సుబేదార్, నారాయణ, నంద, వివిధ చట్టాలు, వాటి ప్రయోజనాలు, న్యా యవాద వృత్తిలో ఉపయోగాలు, నైపుణ్యతలను వివరించారు.
హైకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్ లీగల్/నిజామాబాద్సిటీ, సెప్టెంబర్ 18: ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ను జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్డీవో రవి కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.