జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తక్షణ ప్రజావసరాలు తీరనున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోనున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీఎఫ్) వాటాను సీఎం కేసీఆర్ రూ.5కోట్లకు పెంచారు. ఈ మేరకు జూలై 2న ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఇంతవరకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏటా రూ.మూడు కోట్లు మంజూరు కాగా.. తాజాగా రూ.5 కోట్ల నిధుల మంజూరుతో ప్రజావసరాలను తక్షణం తీర్చేందుకు ప్రజాప్రతినిధులకు చక్కని అవకాశం లభించింది. నిధుల పెంపు నిర్ణయంపై ప్రజాప్రతినిధులందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలకు రూ.5కోట్ల చొప్పున సుమారు రూ.70 కోట్ల మేర నిధులతో అభివృద్ధి మరింత స్పీడు అందుకోనుంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనలో నిమగ్నమయ్యారు.
నిజామాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు నిత్యం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే ప్రతినిధులు. ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకుని వెనువెంటనే పరిష్కరించేందుకు పాటుపడతారు. మాట సాయంతో జరిగే పనులు కోకొల్లలుగా కొనసాగుతూనే ఉంటాయి. ఆర్థిక సాయంతో ముడిపడి ఉన్న పనులకు ప్రజా ప్రతినిధులు అడుగు ముందుకెయ్యాలంటే ప్రభుత్వం నుంచి నిధులు తప్పనిసరి. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీఎఫ్) వాటా అం తంత మాత్రంగానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ మొత్తాన్ని సీఎం కేసీఆర్ పెంచారు. ఏడాదికి రూ.3 కోట్లు చొప్పున విడుదల చేయడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి ప్రజా ప్రయోజనార్థం పనులు చేసి పెట్టేది. ప్రజాప్రతినిధుల చేతిలో కీలకంగా మారిన నియోజకవర్గ అభివృద్ధి నిధులు వాటాను తాజాగా సీఎం కేసీఆర్ రూ.5కోట్లకు పెంచారు. ఈ మేరకు జూలై 2న ఉ త్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలకు దక్కే రూ.5 కోట్ల సీడీఎఫ్తో మొత్తం సుమారుగా రూ.70 కోట్ల మేర అభివృద్ధి పనులు జరుగనున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు తమ విచక్షణ అధికారంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు అవకాశమే లేకుండా పోయేది. తెలంగాణ ప్రాంతానికి చెంది న ఎమ్మెల్యేలపై వివక్ష విపరీతంగా కొనసాగేది. ప్రజలకు సంబంధించిన కీలకమైన పనులను తక్షణం పరిష్కరించాలన్నా ప్రతిపాదనలతో మంత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేది. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిధులు రూ.కోటి మంజూరు అయ్యేవి. ఇందులోనూ ఇన్చార్జి మంత్రి పేరిట రూ.50 లక్షలు కేటాయించేది. మిగిలిన రూ.50లక్షలు మాత్రమే ఖర్చు చేసేందుకు ఎమ్మెల్యేకు స్వేచ్ఛ ఉండేది. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ మొత్తాన్ని సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారు. ఏటా రూ.3 కోట్లు మంజూరు చేశారు. తాజాగా రూ.5కోట్లు మంజూరుతో ప్రజాప్రతినిధులకు ప్రజా అవసరాలు తక్షణం నివారించేందుకు చక్కని అవకా శం దొరికింది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రజాప్రతినిధులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చివరిసారిగా 2018-19 ఏడాదికి గాను ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీపీ కింద నిధులను విడుదల చేసింది. అప్పట్లో ఈ నిధి రూ.మూడు కోట్లు ఉండగా… దానిని తాజాగా రూ.5కోట్లకు పెంచారు. ఈ నిధులను ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. రూ.5కోట్ల నిధులను ఖర్చు పెట్టడానికి సీడీపీ కింద ప్రతిపాదనలకు నిధులు మంజూరు కావాలంటే జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆమోదం తప్పనిసరి. నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. తాగునీరు, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ భవనాలకు మ రమ్మతులు, ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, సామాజిక భవనాలు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. పనుల మంజూ రు విధానంలోనూ సమూల మార్పులు చేసింది. మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు అమలు చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి సర్కారు ఆదేశాలు ఇచ్చింది.
ఉభయ నిజామాబాద్ జిల్లాలో తొమ్మది మందిఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీల్లో కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, రాజేశ్వర్, పట్టాభద్రుల నియోజకవర్గం నుంచి టి.జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5కోట్ల చొ ప్పున రూ.45 కోట్లు, ఎమ్మెల్సీలు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపుగా రూ.70కోట్లు నిధులు సమకూరనున్నాయి. ఉత్తర్వులు వెలువడడంతో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయనున్నారు. ప్రధానంగా విద్యా, వైద్యంపై దృష్టి సారించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులకు సంబంధించిన పనులు టెండర్ల ప్రకారమా? నామినేషన్ పద్ధతా? అనేది ఆయా శాఖల నిబంధనల మేరకు ఉండనుందని అధికారులు చెబుతున్నారు.