దళితబంధు పథకాన్ని దళిత ప్రభుత్వోద్యోగులకూ వర్తింపజేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగసంఘాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం నిజామాబాద్, కామారెడ్డిల్లో సంబురాలు చేసుకున్న ఉద్యోగులు.. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. రాష్ట్రంలోని 42వేలమంది దళిత ఉద్యోగులకు మేలు జరుగుతుందని వారు తెలిపారు.
విద్యానగర్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని ప్రభుత్వ ఉద్యోగులైన దళితులకు కూడావర్తింపజేయనుండడంపై కామారెడ్డి జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకూ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 42 వేల మంది దళిత ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు ఉద్యోగ సంఘాలు అండగా ఉంటాయన్నారు. జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దయానందరావు మా ట్లాడుతూ.. 50 ఏండ్లుగా దళితుల సంక్షేమం గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు బ్యాంకు లింకేజీ లేకుండా అందించడంతోపాటు దళిత ఉద్యోగులకూ ఇస్తామనడం చాలా సంతోషమన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 1974 లో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి దళితులకు బ్యాంకు లింకేజీ లేకుండా వంద శాతం సబ్సిడీతో నేరుగా రూ.10 లక్షలు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. చాలా కాలం పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయడమే కాకుండా పీఆర్సీ ఆమలుచేసి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేరుతెచ్చుకుందన్నారు. ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి రజిత, టీజీవో జిల్లా అధ్యక్షుడు దేవేందర్, టీఎన్జీవోస్ కార్యదర్శి సాయిలు, అసోసియేట్ ప్రెసిడెంట్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ చక్రధర్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి, ఉద్యోగ సం ఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దళితులకు దళిత బంధు పథకం కింద రూ. 10 లక్షలు బ్యాంకు లింకేజీ లేకుండా అందించడం హర్షణీయం. అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేయడానికి దళిత బంధు పథకమే నిదర్శనం.ఉద్యోగులకు కూడా దళిత బంధు అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-దయానంద్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
సీఎం కేసీఆర్ కేవలం దళితులకు మాత్రమే కాకుండా దళిత ఉద్యోగులకూ దళిత బంధు పథకా న్ని వర్తింపజేస్తామనడం చరిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకుంది. ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేస్తారు.
-డి.సంజీవ్రావు,హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్