బీర్కూర్, అక్టోబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని యాసంగిలో పంట మార్పిడి పాటించాలని రైతులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు దసరా పండుగ సందర్భంగా స్పీకర్ను బాన్సువాడ పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ యాసంగి సాగుపై పలు సూచనలు చేశారు. వరిసాగును తగ్గించి అంతకంటే ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఆరుతడి పంటలు, ఆయిల్పామ్పై దృష్టిసారించాలని అన్నారు. ఆయిల్పామ్తో వచ్చే లాభాల గురించి తెలిస్తే ఇక వేరే పంటలజోలికి వెళ్లలేరని వివరించారు. వారి సమక్షంలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్చేసి అయిల్పామ్ గురించి తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. తాను వంద ఎకరాల్లో అయిల్పామ్ సాగుచేస్తున్నట్లు చెప్పారు. మరో 25 ఎకరాల్లో ప్రస్తుతం వరి సాగవుతున్నదని, పంట చేతికి రాగానే ఆయిల్ పామ్ వేస్తానని తెలిపారు. పామ్ గెలలు క్వింటాలుకు సుమారు రూ. 19 వేల నుంచి 20 వేల వరకు వస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గైని మారుతి, బీర్కూర్ ఎంపీటీసీ సందీప్ పటేల్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దుంపల రాజు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.