గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. త్వరలో రెండోవిడుత గొర్రెల పంపిణీ చేపట్టనున్నది. ఈ మేరకు రాయితీ గొర్రెల పథకం నిబంధనల్లో పలు మార్పులు చేసింది. 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన ఒక్కో యూనిట్ ధరను రూ.50వేలు పెంచి, తొలివిడుతతో పోల్చితే అదనంగా మరిన్ని డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. దీంతో రాయితీ గొర్రెల యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ1.75లక్షలకు చేరనుండగా.. ప్రభుత్వ రాయితీ రూ.93వేల నుంచి లక్షా 31వేలకు పెరుగనున్నది. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. గొర్రెల కాపరులకు నాణ్యమైన యూనిట్లను అందించడంతోపాటు బీమా, దాణా సైతం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 643 సొసైటీల్లో మొత్తం 38,471మంది సభ్యులు ఉండగా.. రెండోవిడుత లబ్ధిదారుల జాబితాను అధికారులు ఇప్పటికే రూపొందించారు.
నిజామాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గొల్ల, కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా రాయి తీ గొర్రెల పథకానికి నిబంధనల్లో మార్పులు చేర్పు లు చోటు చేసుకున్నాయి. గొర్రెలను అందించే యూనిట్ ధరను పెంచి తొలి విడుతతో పోలిస్తే అదనంగా మరిన్ని డబ్బులు చెల్లించేలా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గొర్రెల యూనిట్ ధరను పెంచడంతో గొర్రెల కాపరుల వాటాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే డీడీలు చెల్లించి గొర్రెల యూనిట్లు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు కొత్త నిబంధనల వివరాలను అధికారులు వివరిస్తున్నారు. పొరుగు రాష్ర్టాల్లో బహిరంగ మార్కెట్లో ఏర్పడిన మూగ జీవాల కొరతతో పాటు పెరిగిన ధరలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం రాయితీ గొర్రెల పథకం ప్రారంభించిన పది నెలల్లోనే జిల్లా యంత్రాంగం తొలి విడుత పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. రెండో విడుతలో గొర్రెల పంపిణీని విజయవంతం చేసేందుకు పశు వైద్య శాఖ కృషి చేస్తోంది. తాజాగా రాయితీని మరింత పెంచిన ప్రభుత్వం నాణ్యమైన జీవాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీంతోపాటు గొర్రెలకు బీమా, దాణాను అందించాలని నిర్ణయించడంతో ఆయా కుటుంబాలకు భారీ లబ్ధి చేకూరనున్నది.
యూనిట్ పెరుగుదల వివరాలివీ…
ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టెలును అందజేసేందుకు గతంలో లబ్ధిదారుల నుంచి రూ.31,250 డబ్బులను డీడీ రూపంలో తీసుకున్నారు. మారిన నిబంధనల ప్రకారం మరో రూ.12,500 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యూనిట్ రాయితీని పెంచినందుకు లబ్ధిదారుల వాటాను పెంచినట్లుగా ప్రభుత్వం ఇప్పటికే వివరించింది. ఇప్పటికే మార్పులు, చేర్పులకు గురైన పథకం విధివిధానాలకు అనుగుణంగా డీడీలు చెల్లించిన వారంతా నూతన నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేస్తున్నారు. పాత విధానంలో యూనిట్ విలువ రూ.1,25,000 ఉండగా, ఇందులో లబ్ధిదారుల వాటా రూ.31,250 గా నిర్ణయించారు. కొత్త విధానంలో యూనిట్ విలువ రూ.1,75,000 కావడంతో లబ్ధిదారుని వాటా రూ.43,759కి చేరింది. ఇంతకు ముందు రూ.1.25 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.50వేలు పెంపుతో రూ.1.75లక్షలకు చేరింది. గొల్ల, కుర్మ కుటుంబాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంలో అక్రమార్కులు చేరి లబ్ధిదారులను పక్కదారి పట్టించారు. అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో రెండో విడుతలో గొర్రెల పంపిణీని అత్యంత పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సొసైటీల బలోపేతం
ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కుర్మలకు సొసైటీలు స్థాపించుకోవాలంటే అదో పెద్ద తంతుగా ఉండేది. పశు వైద్య శాఖలో ఆయా విభాగాల్లో లంచాలు ఇచ్చుకున్నప్పటికీ సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు లేకపోయేది. సహకార శాఖ ఆధ్వర్యంలో సొసైటీల ఏర్పాటు ఉండడంతో సొసైటీల జోలికి వెళ్లాలంటే అంతా భయపడేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గొల్ల, కుర్మల సొసైటీల ఏర్పాటుకు నిబంధనలను సరళీకరించారు. చట్ట సవరణ చేసి పశు, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనే సొసైటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీంతో పారదర్శకంగా ఎలాంటి పైసా ఖర్చు లేకుండా కనిష్ట సభ్యత్వ రుసుముతో సొసైటీలు జిల్లాలో పురుడు పోసుకున్నాయి. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 329 సొసైటీల్లో 20,971 సభ్యులుండగా, కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 314 సొసైటీల్లో 17, 500 మంది సభ్యులున్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత గొల్ల, కుర్మల సొసైటీల సంఖ్యతో పాటుగా సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అర్హులైన వారంతా నిర్ణీత రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకునే వెసులుబాటు రావడంతో యాదవ సామాజిక వర్గంలోని ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లబ్ధిదారుల జాబితా సిద్ధం
త్వరలోనే గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పశు, సంవర్ధక శాఖ ఇప్పటికే డీడీలు చెల్లించిన వారిలో నూతన మార్గదర్శకాల ప్రకారం చెల్లింపులు చేయించేలా నిమగ్నమయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండో విడుత లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో జాబితా -‘ఏ’ లో 9631 మందికి లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఇందులో 8522 మంది డీడీ లు కట్టారు. వీరందరికీ ఇది వరకే గొర్రెల యూనిట్లు అందించారు. జాబితా ’బీ’లో 5123 డీడీలు రాగా 1103 మందికి యూనిట్లు అందించారు. కొందరు డీడీలు వాపసు తీసుకోగా 1104 డీడీలున్నాయి. వీరందరికీ ఈ దఫా జాబితాలో యూనిట్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో జాబితాలో ‘ఏ’లో 83 49 యూనిట్లు, జాబితా ‘బీ’లో 1744 మందికి యూనిట్లు అందించారు. రెండోవిడుతలో 705 మం ది డీడీలు కట్టిన వారుండడంతో వీరందరికీ యూ నిట్లు మంజూరుకానున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రాయితీ గొర్రెల యూ నిట్ల పంపిణీ మొదలవ్వనుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి యూనిట్లు కొనుగోలు చేసి తెచ్చుకునేలా ఆప్షన్ ఇచ్చారు.