ఆర్మూర్, అక్టోబర్ 16: ఆర్మూర్ ప్రాంత ప్రజల కల ఎట్టకేలకు సాకరమైంది. ఆర్మూర్ ఏరియా దవాఖాన వంద పడకల హాస్పిటల్గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ దవాఖాన ప్రైవేట్కు దీటుగా మెరుగైన సేవలకు చిరునామాగా మారనున్నది. ఈ నేపథ్యంలోదవాఖానలో సౌకర్యాల కల్పన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీవన్రెడ్డి మొదటి పర్యాయంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లోనే ఆర్మూర్ దవాఖానను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వంద పడకల హాస్పిటల్ మారుస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మూర్లోని 30 పడకల ఏరియా దవాఖానను వంద పడకలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో దవాఖానలో అభివృద్ధి పనులు, వసతులు ఏర్పాటయ్యాయి. దవాఖాన ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి వెళ్లడంతో వంద పడకల దవాఖానకు సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించనున్నారు. దవాఖాన నిర్వహణకు భారీగా నిధులు సమకూరనున్నాయి. మత్తు వైద్యుడు, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, పీడీ యాట్రిషన్లు, ఎముకల వైద్యులు, శస్త్ర చికిత్స, ఇతర వైద్యనిపుణులు అందుబాటులోకి రానున్నారు. దవాఖానలో సుమారు 40 మంది వైద్యులు, 30 పైచిలుకు మంది స్టాఫ్ నర్సులు, 20 వరకు పారా మెడికల్ ఉద్యోగులు, మరో 20 పైచిలుకు సహాయ సిబ్బంది సేవలు అందించనున్నారు. సిబ్బందితోపాటు డిజిటల్ ఎక్స్రే, స్కానింగ్ రేడియోగ్రఫీలతో పాటు మరిన్ని అధునాతన వైద్య పరికరాలను ఏర్పా టు చేయనున్నారు. దవాఖానలో రక్తనిధి కేంద్రం వైద్యుల పర్యవేక్షణలో కొనసాగనుంది. రోగుల వెంట వచ్చే వారికి ప్రత్యేక వసతి కల్పించి, వంటగదిని సైతం ఏర్పాటు చేయనున్నారు.
2014 లోనే ఉత్తర్వులు!
ఆర్మూర్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి 2014లోనే 100 పడకల దవాఖానగా మారుస్తున్నట్లు ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయించారు. అదే సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం దవాఖానకు రూ.20.79 కోట్ల నిధులను కేటాయించారు. ఇందులో నుంచి 16.47 కోట్లతో భవన నిర్మాణానికి నిధులను కేటాయించగా దవాఖానలో వసతులు, సౌకర్యాలు, పరికరాల కోసం 1.03 కోట్లను కేటాయించి పనులను చేపట్టారు. వీటితోపాటు మందుల కొనుగోళ్ల కోసం రూ. 52 లక్షలు, ఉద్యోగుల వేతనాల కోసం రూ.2.77 కోట్ల నిధులను కేటాయించారు. వంద పడకల దవాఖానగా మార్చాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే జీవన్రెడ్డి అసెంబ్లీ వేదికగా కోరారు. ఎమ్మెల్యే తీసుకున్న చొరవతో నేడు ఆర్మూర్లో వంద పడకల దవాఖాన ఏర్పాటయ్యింది.
దవాఖానలో సౌకర్యాల ఏర్పాటు
వంద పడకల దవాఖానగా మారుస్తూ 2014లోనే ఉత్తర్వులు ఇచ్చానా తాజాగా మళ్లీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దవాఖాన సకల సౌకర్యాలతో సరికొత్త రూపును సంతరించుకోనుంది. ప్రైవేట్ దవాఖానలకు దీటుగా మెరుగైన వైద్య సేవలను భవిష్యత్తులో అందించనుంది. ఆధునాతనమైన వైద్య పరికరాల సహాయంతో పలురకాల రక్త పరీక్షలను ఇక్కడే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్మూర్లోని ఏరియా దవాఖానను కార్పొరేట్ దవాఖాన తరహాలో అభివృద్ధి చేయించాం. పలు రకాల రక్త పరీక్షలతోపాటు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చొరవతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు అపోహను వీడాలి. ఆర్మూర్ ఏరియా దవాఖానలోమెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి.