ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 16:
పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మొక్కుబడిగా కాకుండా వైద్యులు సూచించిన దాణా అందిస్తే..పశువుల శరీర అవసరాలకు అనుగుణంగా పోషక విలువలు సమకూరడంతో నాణ్యమైన పాల ఉత్పత్తికి అవకాశముంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. పలు వ్యాధులు, వాటి నివారణపై పశువైద్యుల సూచనలు..
పాల జ్వరం (మిల్క్ ఫీవర్)….
ఇది పశువుల్లో కాల్షియం లోపంతో వచ్చే వ్యాధి. ఎక్కువగా పాలిచ్చే వయస్సు మళ్లిన పశువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈనడానికి 72 గంటల్లో పాలజ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉం టుంది. ఈ సమయంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈనిన సమయంలో వ్యాధికి గురవుతాయి. కాల్షి యం తగ్గిపోవడంతో పశువు ఈనడానికి ముందు, ఈనిన తర్వాత, ఈనే క్రమంలో కండరాలు బలహీన పడడంతో ఈ వ్యాధి వస్తుంది.
వ్యాధి నిర్ధారణ..చికిత్స..
పశువులలో కనిపించే ఈ లక్షణాల మేరకు చికిత్స ప్రారంభించాలి. వీలైనంత త్వరగా సీరమ్ క్యాల్షియం స్థాయిని పునరుద్ధరించాలి. కాల్షియం గ్లూకోనేట్సాల్ట్ను పశువుల కు నరంద్వారా ఎక్కించాలి.
వ్యాధి లక్షణాలు
మొదటి దశ : పశువు నిలబడగలిగి ఆందోళన, అసహనం, ఒక రకమైన ఉద్రిక్తత, కంగారుతో అరుస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో వెంటనే చికిత్స ప్రారంభించాలి. రెండోదశ : పశువులు నిలకడ లేకుండా ఛాతీ ఆధారం చేసుకొని కూర్చుంటాయి. మేత మేయకుండా పెదవులు పొడిగా మారుతాయి. మూడోదశ : పశువులు క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. పూర్తిగా పక్కకు పడిపోయి స్పర్శ, స్పందన లేకుండా ఉంటాయి.
హైపోమెగ్నీషియా
మెగ్నీషియం లోపంతో పశువులు ఈ వ్యాధి బారినపడతాయి. కండరాల కదలికలకు శక్తిని ఇవ్వడానికి మెగ్నీషియం అవసరం, ఎక్కువగా పాలిచ్చే పశువులు కేవలం పచ్చిక బయళ్లపై ఆధారపడినప్పుడు వస్తుంది.
వ్యాధి లక్షణాలు..చికిత్సా విధానం..
ఈ సమయంలో పశువులు కండరాలు, నరాల సమస్యలు ఉత్పన్నమై శూన్యంలోకి చూస్తూ అరుస్తూ దగ్గరికి వచ్చే వారిపై దాడి చేస్తూ ఉంటాయి. ఇలాంటి పశువులకు చికిత్స విధానంలో కాల్షియం పాస్పరస్, మెగ్నీషియం ఉమ్మడి మిశ్రమం ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలి.
కిటోసిస్ (అసిటోనిమియా)..
అధికంగా పాలిచ్చే పశువుల్లో ఈనిన 60 రోజుల వ్యవధిలో ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంటుంది.రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయి కిటోసిస్ బాడీస్ విడుదల అవ్వడంతో పశువులు ఈ వ్యాధికి గురయ్యాయని గుర్తించాలి.
వ్యాధి లక్షణాలు..చికిత్సా విధానం..
వ్యాధి సోకిన పశువులు నిస్తేజంగా ఉండి ఆందోళనతో బరువు తగ్గి, పాల దిగుబడి తగ్గుతుంది. రోజువారీ మేతలో సోడియం ప్రొపియేనేట్, ప్రొఫైలిన్ గైకాల్ కలపడం ద్వారా కిటోసిస్ నివారించవచ్చు. ఈనడానికి 14 రోజుల ముందు నుంచి మేతలో రోజుకు 120 మి.లీ. ప్రొఫైలిన్ గైకాల్ ఇచ్చి ఏడు వారాల వరకు కొనసాగిస్తే కిటోసిస్ ఏర్పడే అవకాశాన్ని తగ్గించవచ్చు.
పోషకాలున్న దాణా వేయాలి
పశుపోషణలో ప్రధానంగా పోషకాలున్న దాణా వేస్తే రోగాలను నివారించడంతోపాటు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. పశువులను రెండు, మూడు రోజులకోసారి శుభ్రమైన నీటితో కడిగాలి. పశువులకు పచ్చిగడ్డి రకాలు నేపియర్, జొన్నగడ్డి లాంటి రకాలను దాణాగా ఇవ్వాలి.