బిచ్కుంద, సెప్టెంబర్ 15 : మండలకేంద్రంతోపాటు పెద్దదేవాడ, చిన్నదడ్గి, రాజాపూర్, గుండెనెమ్లి, హస్గుల్ గ్రామాల్లో కల్లు డిపో నిర్వాహకులు తయారు చేస్తున్న కృత్రిమ కల్లుతో ఆయా గ్రామాల ప్రజలు వింతగా ప్రవరిస్తున్నారు. నిషేధిత రసాయనాలు కలిపి కల్లును తయారు చేస్తున్నారు. కృత్రిమ కల్లును సేవించిన వారు మత్తుకు బానిసలుగా మారుతున్నారు. నిషేధిత పదార్థాలతో కల్లును తయారు చేసి విక్రయిస్తున్నా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కల్లు దుకాణదారుల నుంచి అధికారులు ప్రతినెలా మామూళ్లు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
గిరాకీ కోసం పోటీ..
కల్లు గిరాకీ కోసం దుకాణదారుల మధ్య పోటీ నెలకొన్నది. గిరాకీ ఎక్కువ రావడానికి కల్లులో మత్తు పదార్థాలను అధిక మోతాదులో కలిపి విక్రయిస్తున్నారు. బిచ్కుందలోని వివిధ గ్రామాల్లో ఈత, తాటి వనాలు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో కృత్రిమ కల్లుకు గిరాకీ బాగా పెరిగింది. ప్రతి రోజూ కల్లు తాగిన వారికి ఒక రోజు తాగకపోతే నిద్రపట్టదని కల్లుప్రియులు పేర్కొన్నారు. కృత్రిమ కల్లుతో నరాలు దెబ్బతినడంతోపాటు అనారోగ్యం బారిన పడతారని వైద్యులు పేర్కొంటున్నారు. కల్లు డిపోల్లో తయారుచేస్తున్న కృత్రిమ కల్లుపై సంబంధిత అధికారులు విచారణ జరిపి ముస్తేదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం
బిచ్కుంద మండలంలో కృత్రిమ కల్లు తయారీ విషయం మా దృష్టికి రాలేదు. కల్లు డిపోల్లో తనిఖీలు చేపడతాం. కృత్రిమ కల్లు తయారు చేస్తే కేసులు నమోదు చేసి వారి లైసెన్సులను రద్దు చేస్తాం.