నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 15: 18 ఏండ్లు నిండిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ పంచాయతీలు, పాఠశాల భవనాల ఎదుట టెంట్ను వేయించి టీకాలను పంపిణీ చేయించాలన్నారు. అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు సహకారం అందించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కోసం అవసరం ఉంటే రైతువేదికలను ఉపయోగించుకోవాలని మంత్రి తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రోజుకు పదివేల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, 30వేల మందికి వేసే కెపాసిటీ ఉందన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి సబ్ సెంటర్లో రోజుకు 125 మందికి టీకా వేస్తే.. 20 రోజుల్లో ఆరు లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు. నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థాయిలో ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. సర్వే చేపట్టిన ఇంటికి స్టిక్కర్ను అతికించాలన్నారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీపీవో సునంద, డీఎంహెచ్వో చంద్రశేఖర్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ పాల్గొన్నారు.