తాడ్వాయి, సెప్టెంబర్ 15: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామ శివారులో దళితుల భూములను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఆక్రమించుకున్నాడని పలువురు దళితులు తహసీల్దార్ సునీతకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని తమకు పంపిణీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎర్రాపహాడ్ గ్రామ శివారులో మాజీ ఎమ్మెల్యే దాదాపు 250 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంటలను సాగుచేస్తున్నాడని అన్నారు. పక్కనే ఉన్న దళితుల భూమితోపాటు అసైన్డ్ భూమి దాదాపు 30 ఎకరాల వరకు ఆక్రమించాడని అన్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి మాజీ ఎమ్మెల్యే స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి దళితులకు ఇప్పించాలని కోరారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన వారిలో చిట్యాల సాయన్న, పోచయ్య, మైసయ్య, గైని రాజయ్య తదితరులు ఉన్నారు.