తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల ప్రస్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజలకు కేసీఆరే ఓ వజ్రాయుధమని, ఆయన సారథ్యంలో తెలంగాణ ప్రస్తుతం దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని, జీడీపీలో రాష్ట్రం దేశంలోనే నాలుగోస్థానంలో ఉందని తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న కవిత గురువారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, అక్కడ టీఆర్ఎస్ గెలుపు తథ్యమని అన్నారు. ‘జనరల్ ఎలక్షన్లే తప్ప.. ఉపఎన్నికలు ఎప్పటికీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కావు. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ గెలుపును బీజేపీ రెఫరెండంగా తీసుకుంటుందా..?’ అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. రెండు దశాబ్దాల ప్రస్థానంలో టీఆర్ఎస్ 99శాతం ఉప ఎన్నికల్లో గెలిచిందని, హుజూరాబాద్లో బీజేపీ తమకు పోటీయేకాదని ఆమె స్పష్టంచేశారు.
నిజామాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హుజూరాబాద్ ఉప ఎ న్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు తథ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాక మునుపు, వచ్చిన తర్వాత అనేక రకాల ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. రెఫరెండం అని ఎవరు పడితే వారు అంటే కుదరదని చెప్పారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పే రెఫరెండమని అన్నారు. వచ్చే జనరల్ ఎలక్షన్స్ రెఫరండం అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపును బీజేపీ రెఫరెండంగా తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పును రెఫరెండంగా తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు కావాలని చెప్పారు. నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానికంగా మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎలక్షన్స్తో పాటు తెలంగాణ విజయ గర్జన భారీ సభపై ఆమె స్పందించారు. రెండు దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాల ద్వారా స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. సింహగర్జన నుంచి వచ్చే నెలలో తలపెట్టిన విజయగర్జన వరకు టీఆర్ఎస్ గమనం ఎనలేనిదని చెప్పారు.
కేసీఆర్ ఓ వజ్రాయుధం…
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఓ వజ్రాయుధం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలకు టీఆర్ఎస్ పార్టీ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ప్రభుత్వ పనితీరుతో దేశానికి రోల్ మోడల్గా నూతన రాష్ట్రం నిలబడడం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర స్వప్నానికి నిదర్శనం అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఒక రాష్ర్టాన్ని శాశ్వతంగా ధనికమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో సీఎం నిమగ్నమయ్యారని కవిత చెప్పారు. పది మందికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారామంటే కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనం అని చెప్పారు. జీడీపీలో దేశంలో తెలంగాణ రాష్ట్రం నేడు 4వ స్థానంలో నిలిచిందంటే సాధారణ విషయం కాదన్నారు. ప్రస్తుతం దేశానికి దిక్సూచిగా మారామని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా మూలంగా పెట్టుబడులు తిరిగి వెళ్తున్న ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కవిత వివరించారు. ఉద్యోగాల కల్పనతో పాటు ప్రైవేటు పెట్టుబడులు తెస్తుండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. గడిచిన రెండేండ్లలో అత్యధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ నాయకత్వంలో నిరంతరం ప్రజలకు ఏమి కావాలో చర్చ జరుగుతుంటుందని అన్నారు. కేసీఆర్ ఓపెన్ హార్ట్తో ప్రజల మేలు కోసం పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను అనుసరించి నడుచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు చెప్పేది టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదని, మిగిలిన వారు అలా చేయకపోవడంతోనే కనుమరుగయ్యారని అన్నా రు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం పెడితే ఒడిస్సాతో పాటు ఏడెనిమిది రాష్ర్టాల్లో అమలు చేశారన్నారు. షీ టీములు 20 రాష్ర్టాల్లో అమలవుతున్నాయన్నారు.
బీజేపీ పోటీయే కాదు…
హుజూరాబాద్లో జరుగుతున్న ఉప ఎన్నికపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ గెలవబోయేది ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవేనని కుండబద్ధలు కొట్టారు. ప్రజలతో మమేకమైన పార్టీ ఎప్పుడైన పారే నదిలాగా ఉంటుందని కవిత అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రత్యేకంగా చూడాల్సిన ఎన్నిక కాదన్నారు. అన్ని ఎన్నికల మాదిరిగానే హుజూరాబాద్లో ఎలక్షన్ నడుస్తోందని చెప్పారు. బీజేపీ ప్రజల హృదయాల నుంచి దూరమైందన్నారు. రాబందుల్లాగా రైతులను ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని వివరించారు. ఆడబిడ్డల కోసం కేసీఆర్ మేలు చేస్తుంటే… ఆడబిడ్డలపై గ్యాస్ ధరలు పెంచి బరువు మోపుతున్న పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో 99 శాతం మేర ఉప ఎన్నికల్లో గెలుపొందామన్నారు. మమతా బెనర్జీ గెలుపు రెఫరెండం అయితే బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నాగార్జున సాగర్ ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. టీఆర్ఎస్ పార్టీలో పుట్టి, పెరిగి తిరిగి అదే పార్టీని శాపనార్థాలు పెట్టిన వాళ్లెవరూ బాగుపడలేదన్నారు. వరంగల్లో తలపెట్టిన విజయ గర్జన సభను విజయవంతం చేయాలని శ్రేణులకు కవిత పిలుపునిచ్చారు. టీఆర్ఎస్కు భారీ బహిరంగ సభలకు అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ఈటల రాజేందర్ ప్రజలకు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజీపీ తమకు ప్రధాన పోటీదారు అని మేము అనుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు.