దసరా పండుగను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించుకోనున్నారు. హిందువుల పండుగల్లో దసరా ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదో రోజు విజయదశమిని నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవీ అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణం చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్న వారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం. శమీ చెట్టు పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్ర్తాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకొంటారు.
పాలపిట్ట దర్శనం శుభసూచకం
పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టను చూడడం ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే జమ్మిచెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అలాగే గుర్తుకు వస్తుంది. విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతిపనీ విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసిస్తారు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనపడిందట. అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. అందుకే విజయదశమి రోజున పాలపిట్టను చూస్తారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విజయదశమి పురస్కరించుకొని శుక్రవారం సాయత్రం 6 గంటలకు పాలిటెక్నిక్ మైదానంలో జంబిచెట్టుకు పూజలు, బాణాసంచా విన్యాసం(క్రాకర్స్ షో) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు.
ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలి
మంత్రి వేముల
వేల్పూర్,అక్టోబర్14: ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగా ప్రతి ఇంట్లో సంతోషం నింపాలని, ఐష్టెశ్వర్యాలతో విరాజిల్లాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాడి పంటలతో రైతులు సుభిక్షంగా వద్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలందరూ సంతోషంగా దసరా పండుగా జరుపుకోవాలని కోరారు.
పండుగను ఆనందంగా జరుపుకోవాలి
స్పీకర్ పోచారం
బాన్సువాడ, ఆక్టోబర్ 14 : రాష్ట్ర ప్రజలకు విజయదశమి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానిక ప్రతీక విజయదశమి అని.. ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ఆకాక్షించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు.