సంస్థాగత నిర్మాణంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు, అనుబంధ విభాగాలను నియమిస్తున్నారు. నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా టీఆర్ఎస్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 2న నిర్వహించిన జెండాపండుగ కార్యక్రమంతో సంస్థాగత నిర్మాణం ప్రారంభం కాగా, 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. గ్రామ కమిటీలో 15మంది సభ్యులకు స్థానం కల్పించారు. వారిలో 8మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 20 వరకు మండల కమిటీలను ఎంపిక చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో వార్డులు, డివిజన్లలోనూ కమిటీలను నియమించారు. నూతన కార్యవర్గాల ఏర్పాటుపై పార్టీ శ్రేణుల్లో కొంగొత్త జోష్ కనిపిస్తోంది.
నిజామాబాద్, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండేండ్ల తరువాత సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర సమి తి దృష్టి సారించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గాల కూర్పు కొనసాగుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు, అనుబంధ విభాగాల ఎంపిక ప్రక్రియ జోరుగా జరుగుతోంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇప్పటికే పార్టీ షెడ్యూల్ను ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించిన టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంతో సంస్థాగత నిర్మాణం ప్రారంభమైంది. సెప్టెంబర్ 12 నాటికి గ్రామ, వార్డు స్థాయి కమిటీల కూర్పు పూర్తయ్యింది. గ్రామాలతోపాటు నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్లలోనూ కమిటీలను నియమించారు. సెప్టెంబర్ 12 నుంచి మండల కమిటీల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించగా.. కార్యవర్గాల కూర్పు ప్రక్రియ జోరుగా జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వ్యక్తులతోపాటు ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యతను ఇస్తూ నియామకం చేపడుతున్నారు.
జోరుగా మండల కమిటీలు…
గ్రామ, వార్డు కమిటీలు పూర్తి కావడంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో మండల కమిటీలను నియమిస్తున్నారు. అక్కడక్కడ సామాజిక సమీకరణాల మూలంగా పలు గ్రామ, వార్డు కమిటీల కూర్పు నిలిచిపోయింది. ఒకట్రెండు రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతో కార్యవర్గాల కూర్పులో వేగం పుంజుకుంది. ఈసారి టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గాల కూర్పులో కట్టుదిట్టమైన నిబంధనలను పాటిస్తున్నారు. ఇష్టానుసారంగా, ఇబ్బడిముబ్బడిగా కమిటీల్లో చోటు కల్పించకుండా నిర్దిష్ట సంఖ్యతో నియామకం చేపడుతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డుల కమిటీలు వేశారు. ప్రస్తుతం 20వ తేదీ వరకు మండల కమిటీలను ఎంపిక చేస్తున్నారు. గ్రామ స్థాయిలో 15 మంది సభ్యులకు చోటు ఇచ్చారు. అందులో కచ్చితంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతోపాటు 11 మందితో అనుబంధ కమిటీలైన విద్యార్థి, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్, కార్మిక, రైతు విభాగం, సోషల్ మీడియా తదితర అనుబంధ సంఘాలకు సభ్యులతోపాటు అధ్యక్ష, కార్యదర్శులను నియమిస్తున్నారు. మండల, జిల్లా కమిటీలను సైతం ఒకే విధంగా ఉండేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీలోగా ప్రక్రియను ముగించాలని పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు కార్యవర్గాల నియామకం జరుగుతోంది.
టీఆర్ఎస్ నూతన ఒరవడి
తెలంగాణ రాష్ట్ర సమితి మిగిలిన అన్ని పార్టీలకు భిన్నం. స్వరాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించిన పార్టీగా ప్రజల్లో చిరస్థాయి గుర్తింపు దక్కించుకుంది. రెండు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నట్లుగానే పార్టీలోనూ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చేలా ఈసారి కచ్చితమైన నిబంధన విధించారు. కాంగ్రెస్, బీజేపీ వంటి ఏ జాతీయ పార్టీలో లేని విధంగా టీఆర్ఎస్ నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. ఇతర రాజకీయ పార్టీల్లో అనుబంధ సంఘాల ఏర్పాటు మినహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కీలమైన పదవుల్లో, కమిటీల్లో స్థానం కల్పించడం అన్నది కలలో కూడా ఊహించలేనిది. ఆధిపత్యమంతా కొద్ది మంది కీలకమైన లీడర్లదే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో మాత్రం ఇందుకు భిన్నమైన పద్ధతిని అవలంభిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ నియమావళి ప్రకారం ఏ కమిటీ నియమించినా అందులో క్రియాశీల సభ్యులే ఉండాలి. ఏ కమిటీ చెల్లుబాటు కావాలన్నా 51శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. 51శాతానికి పైగా ఆయా వర్గాలకు స్థానం లేకుంటే కమిటీలు చెల్లుబాటు కావని ఇప్పటికే అధిష్టానం ప్రకటించింది.
గులాబీ శ్రేణుల్లో జోష్..
అధికార టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంగొత్త జోష్ కనిపిస్తోంది. అధినేత నిర్ణయంతో పార్టీ పదవులను భర్తీ చేస్తుండడంతో నూతన ఉత్సాహం రెట్టింపైంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నూతన కార్యవర్గాల కూర్పుతో కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు కమిటీలు ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. క్షేత్ర స్థాయిలో పదవుల భర్తీతో కింది స్థాయి లో పార్టీ బలోపేతమైంది. అంతేగాకుండా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ పదవులను భర్తీ చేయబోతుండడంతో ఆశావహులంతా పదవులపై ఆశక్తి చూపుతున్నారు. జిల్లా అధ్యక్ష పీఠాలను అధిరోహించేందుకు పెద్ద నాయకులు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టనుండడంతో అందరిలోనూ ఎవరి పేరు తెరమీదికి వస్తుందో? అన్న ఉత్కంఠ వెంటాడుతోంది. గులాబీ పార్టీకి అనుబంధ విభాగాలు గతం నుంచి ప్రణాళికతో పని చేస్తున్నాయి. ఇందులో కీలకంగా కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, రైతు విభాగాలు గతం నుంచి పటిష్టవంతంగా ఉన్నాయి. సంస్థాగత బలోపేతంలో భాగంగా టీఆర్ఎస్ ఆయా విభాగాల కూర్పును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆయా విభాగాల్లోనూ ఆనందం వ్యక్తం అవుతోంది.