అడుగులు.. నుడుగులు కలిశాయి. వీధులన్నీ వర్ణరంజితం అయ్యాయి. తీరొక్కపూలను ఒక్కదగ్గర చేర్చి. పేర్చిన బతుకమ్మలు పూలసింగిడిని పూయించాయి. మహిళలు ఆడిపాడగా.. పల్లెలు, పట్టణాలు మార్మోగాయి. ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకాయి. గౌరమ్మను గంగమ్మ చెంతకు చేర్చిన మహిళలు వచ్చే ఏడాది మళ్లీ రావాలంటూ కోరుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మెట్టింట సంబురాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్లో మహిళలతో కలిసి ఆడిపాడారు.
ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు బుధవారం అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. దీంతో ఊరూవాడా పూలవనాన్ని తలపించింది. ఆడపడుచులు గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడారు. మహిళలందరూ ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడుతూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకొన్నారు. ‘పోయి రావమ్మా .. పోయి రావమ్మా సద్దుల బతుకమ్మా’ అంటూ మహిళలు చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. అనంతరం వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
ఇందూర్/విద్యానగర్, అక్టోబర్ 13