ఇందూరు, అక్టోబర్ 13 : నిజామాబాద్ నగరంలోని రాజారాం స్టేడియంలో వహీద్ మెమోరియల్ ఇన్విటేషన్ ఆల్ ఇండియా జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నది. బుధవారం తొలిరోజు పోటీలను నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు నిజామాబాద్కు రావడం సంతోషకరమైన విషయమన్నారు. వారితో కలిసి ఆడడంతో జిల్లాకు చెందిన క్రీడాకారుల్లో నైపుణ్యం మెరుగవుతుందని అన్నారు. గుగులోత్ సౌమ్య, రిషిక నిజామాబాద్కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టారని గుర్తుచేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నరాల సుధాకర్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ్, కోచ్ గొట్టిపాటి నాగరాజు, ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అంద్యాల లింగం, సాయాగౌడ్, సుబ్బారావు, ప్రశాంత్, జావిద్, కొయ్యాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు మ్యాచ్ల వివరాలు..
ఉదయం హైదరాబాద్ -ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 3-0 తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో చెన్నై -మధ్యప్రదేశ్ తలపడగా చెన్నై 6-0 తేడాతో గెలుపొందింది. 3వ మ్యాచ్లో కేరళ-మహారాష్ట్ర జట్లు పోటీపడగా ఉత్కంఠగా కొనసాగింది. చివరి దాకా 2-2 గోల్స్తో సమంగా కొనసాగిన మ్యాచ్.. చివరి 5 నిమిషాల్లో కేరళ జట్టు అద్భుతమైన గోల్ సాధించడంతో 3-2 తేడాతో గెలిచింది. నాల్గో మ్యాచ్ నిజామాబాద్కు చెందిన కేర్ ఫుట్బాల్ అకాడమీ- బెంగుళూరు తలపడ్డాయి. ఇందులో కేర్ఫుట్బాల్ అకాడమీ జట్టు 6-1 తేడా విజయం సాధించింది.