పొట్ట కూటి కోసం పంజాబ్ నుంచి వచ్చిన వారు నిద్రలోనే శాశ్వతనిద్రలోకి జారిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ముగ్గురి దారుణ హత్య కలకలం రేపింది. డిచ్పల్లి నాగేపూర్గేటు వద్ద ఉన్న హార్వెస్టర్ మెకానిక్ షెడ్డులో బుధవారం ముగ్గురి మృతదేహాలు రక్తపు మడుగుల్లో కనిపించాయి. హర్పాల్సింగ్, జోగిందర్సింగ్ ఇద్దరూ పంజాబ్కు చెందిన మెకానిక్లు కాగా, రాత్రి బస కోసం షెడ్డుకు వచ్చిన సంగారెడ్డికి చెందిన క్రేన్ డ్రైవర్ సునీల్ కూడా వారితోపాటే దుండగుల చేతిలో హతమయ్యాడు. ముఖాలపై మోది ముగ్గురిని కిరాతకంగా హతమార్చింది ఎవరో, ఎందుకు ఈ ఊచకోతకు పాల్పడ్డారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
డిచ్పల్లి, డిసెంబర్ 8 : ఒకే చోట ముగ్గురు హత్యకు గురికావడం నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 44వ నంబర్ జాతీయ రహదారికి పక్కనే నాగ్పూర్ గేట్ వద్ద గురునానక్ హార్వెస్టర్ రిపేరింగ్ వర్క్షాపు ఉన్నది. ఇందులో పంజాబ్కు చెందిన హర్పల్ సింగ్ (33) 8 నెలలుగా మెకానిక్గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే పంజాబ్కు చెందిన జోగిందర్ సింగ్ (45)ను మెకానిక్గా పనిచేసేందుకు పిలిపించారు. మంగళవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు షెడ్డులోకి చొరబడి మారణాయుధాలతో ఇద్దరి తలలపై గట్టిగా మోది హత్య చేశారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం భోజ్యానాయక్ తండాకు చెందిన బానోత్ సునీల్ (25) క్రేన్ డ్రైవర్గా పనిచేస్తూ అప్పుడప్పుడు హార్వెస్టర్ షెడ్డులో నిద్రిస్తుంటాడు. రాత్రి పొద్దుపోయేసరికి షెడ్డు బయట మంచంపై నిద్రించాడు. అతన్ని సైతం దుండగులు తలపై మోది హత్య చేశారు. వారి వద్ద ఉన్న కొంత నగదుతో పాటు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హత్య జరిగిన విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి సీఐ రఘునాథ్, ఎస్సై ఆంజనేయులు చేరుకొని సీపీ కార్తికేయకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి సీపీ కార్తికేయ, అడిషనల్ డీసీపీ క్రైమ్ స్వామి, అడిషనల్ డీసీపీ అరవింద్బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు చేరుకొని పరిశీలించారు. డాగ్స్కాడ్, క్లూస్ టీమును రప్పించి వివరాలు సేకరించారు. డాగ్స్కాడ్ మృతదేహాల వద్ద నుంచి ఆర్మూర్ రోడ్డువైపు వెళ్లి అక్కడే ఆగిపోయింది.
మరో 15 రోజుల్లో పంజాబ్ వెళ్లేవారు…
ప్రతి మూడు నెలలకోసారి వరికోత సమయంలో హార్వెస్టర్ మిషన్లు రిపేర్ చేసేందుకు పంజాబ్ నుంచి మెకానిక్లు వచ్చిపోతుండే వారు. మరో 15 రోజుల్లో పనులు ముగించుకొని పంజాబ్ వెళ్లాల్సి ఉన్న సమయంలోనే అర్ధరాత్రి దుండగుల చేతిలో మృత్యువాత పడ్డారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతం చుట్టుపక్కల దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. హత్యల విషయాన్ని పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించామని తెలిపారు.
మూడు సీసీ కెమెరాలు ఉన్నా ?
మెకానిక్ షాపులో మూడు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి కొద్దిరోజుల క్రితమే చెడిపోయాయి. రెండు రోజుల క్రితమే సీసీ కెమెరాలు రిపేర్ చేయాలని మెకానిక్కు ఫోన్ ద్వారా తెలిపామని హార్వెస్టర్ షాపు యజమాని సంజీవ్రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే హత్యకు పాల్పడిన వారి వివరాలు తెలిసి ఉండేవని పోలీసులు పేర్కొన్నారు.