వర్గల్లో కాళేశ్వరం నీళ్లను హల్దీవాగుకు వదిలిన ముఖ్యమంత్రి కేసీఆర్
కొండపోచమ్మసాగర్ నుంచి పరుగులు తీస్తోన్న గోదావరి జలాలు
వేయికండ్లతో ఎదురుచూస్తున్న నిజాంసాగర్ ఆయకట్టు రైతులు
ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్పీకర్ పోచారం, మంత్రి ప్రశాంత్రెడ్డి,
ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్లు విఠల్రావు, దఫేదార్ శోభ హాజరు
96 కిలోమీటర్లు ప్రయాణించి 10 రోజుల్లో
నిజాంసాగర్కు చేరనున్న కాళేశ్వరం నీళ్లు
నిజామాబాద్, ఏప్రిల్ 6, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నది ఉపనదిని సంగమిస్తున్న అద్భుత సన్నివేశం.. మంజీర నాదాలతో గోదావరి పరవళ్లు తొక్కుతున్న అపూర్వ సందర్భం.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చూడాలన్న కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా కాళేశ్వర జలధార ఎర్రటెండల్లో మంజీర పరీవాహకానికి ఎగిసివచ్చింది. వర్గల్ మండలం అవుసలిపల్లి వద్ద హల్దీవాగులోకి గోదావరి జలాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం విడుదల చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతుల కన్నీటిని తుడిచేందుకు, బీడుభూముల్ని తడిపేందుకు గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. 96కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిజాంసాగర్ జలాశయాన్ని మరో పదిరోజుల్లో ముద్దాడనున్నాయి. దీంతో కోల్పోయిన జలవైభవాన్ని తిరిగిపొంది చారిత్రక ప్రాజెక్టు జయపతాకను ఎగురవేయనుంది.
కాళేశ్వర ప్రాజెక్టులో మరో కీలకమైన ముందడుగు పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రణాళికలో మరో మైలురాయి దాటింది. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం.. అన్న కేసీఆర్ మాటలు నిజమయ్యే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అపర భగీరథ ప్రయత్నంలో లక్షలాది ఎకరాలకు సాగు, ప్రజలకు తాగు నీరు అందిస్తున్న కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా రోజురోజుకూ కొత్త ఆయకట్టు స్థిరీకరించబడుతుండడం విశేషం. గ్రావిటీ ఆధారంగా చేసుకుని ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా తక్కువ ఖర్చు, తక్కువ భూసేకరణ ద్వారా ఎలాంటి చింతల్లేకుండా సులువుగా గోదావరి జలాలను బీడు భూములకు తరలించే ప్రక్రియ అద్భుతంగా అమలవుతున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన ప్రణాళిక మంగళవారం అమలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆయువు పట్టుగా ఉన్న చారిత్రక ప్రాజెక్టు కొన్నాళ్లుగా బోసిపోతుండగా కొండపోచమ్మ సాగర్ నుంచి నీటి విడుదలతో త్వరలోనే పూర్వవైభవం చేకూరనున్నది. కాలంతో సంబంధం లేకుండా రైతుల అవసరాలే ప్రాతిపదికగా గోదావరి నీళ్లు మంజీర నది మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల చేళ్లను త్వరలోనే తడపనున్నది.
మంజీర బెల్టులో గోదావరి పరవళ్లు…
వేసవి కాలంలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు జలకళను సంతరించుకోనున్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేక బోసిపోయిన ప్రాంతాలన్నీ గోదావరి జలాలతో పరవళ్లు తొక్కనున్నాయి. వాగులపై నిర్మించిన చెక్డ్యాంలు ఏడాది పొడవునా నీటితో కళకళలాడనున్నాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలోని ఆరు మండలాల మీదుగా ప్రవహించే కూడవెల్లి వాగుకు ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వాగు ద్వారా ఇప్పటికే గోదావరి జలాలు సిరిసిల్లా జిల్లా గంభీరావుపేటలోని ఎగువ మానేరుకు చేరాయి. తద్వారా కామారెడ్డి జిల్లాలోని బీబీపేట ప్రాంతంలోని కొంత ఆయకట్టుకు జలాలు ఉపయుక్తం అవుతున్నాయి. అక్కడ ఇప్పటికే 0.5టీఎంసీలు గోదావరి నీళ్లు నిల్వ అయ్యాయి. మంగళవారం సీఎంకేసీఆర్ చేతుల మీదుగా హల్దీవాగుకు జలాలను విడుదల చేశారు. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి కాలువ ద్వారా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులు తొలుత నిండనున్నాయి. తర్వాత హల్దీవాగుకు కొండపోచమ్మ నీళ్లు చేరతాయి. సంగారెడ్డి కాలువ నుంచి నిజాంసాగర్ వరకు 96 కిలో మీటర్ల మేర ఈ జలాలు రాత్రి పగలు ప్రవహిస్తాయి.
వానకాలం పంటకు లేదు ఢోకా
నిజాంసాగర్లో ప్రస్తుతం 7.23 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా ఆయకట్టుకు మరో తడి అందేంచుకు 1.2టీఎంసీలు వాడనున్నారు. అవి పోగా నిజాంసాగర్లో నీటి నిల్వ ఆరు టీఎంసీలకు చేరనుంది. హల్దీవాగు ద్వారా వచ్చే 4 టీఎంసీలను కలిపితే పూర్తి నిల్వ 10టీఎంసీలకు చేరుతుంది. వచ్చే వానకాలం పంటకు వర్షాలు లేకపోయినా వీటిని వాడుకునే పరిస్థితి ప్రస్తుతం నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు అద్భుత అవకాశం దక్కనుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని ఏడు మండలాల్లోని 14వేల ఎకరాల వరి పంటకు తక్షణ ప్రయోజనం దక్కుతుండగా… కొండపోచమ్మ సాగర్ నీళ్ల రాకతో నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు గుండె ధైర్యం వచ్చింది. ఇన్నాళ్లు వానలు పడితేనే ఆయకట్టుకు భవిష్యత్తు ఉండేది. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. సంగారెడ్డి కాలువ ద్వారా చెరువులు, వాటి నుంచి హల్దీవాగులోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ నిజాంసాగర్ వైపు ఉరకలు వేస్తోంది. వాగులు జలకళను సంతరించుకుంటుండడం, ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి బోర్ల కింద సాగు చేసే వారికీ ఉపయుక్తంగా ఉండనుంది. ఒకప్పుడు వానొస్తే మాత్రమే పరవళ్లు తొక్కే హల్దీవాగు, మంజీర నది ఇకపై గోదావరి ఉరకలతో 365 రోజులు జలకళను సంతరించుకోనున్నాయి.
అట్టహాసంగా కార్యక్రమం..
కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను నిజాంసాగర్కు తరలించే ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హరీశ్రావు వర్గల్ మండలంలోని అవుసులపల్లి వద్ద లాంఛనంగా సంగారెడ్డి కాలువకు కాళేశ్వరం నీళ్లను విడుదల చేశారు. కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కామారెడ్డి, నిజామా బాద్ జడ్పీ చైర్మన్లు దఫేదార్ శోభారాజు, దాదన్నగారి విఠల్ రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. గోదావరి జలాలకు సీఎంతో కలిసి ప్రజా ప్రతినిధులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ నుంచి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల కానుంది. సంగారెడ్డి కెనాల్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి 1600 క్యూసెక్కుల చొప్పున హల్దీవాగుకు నీరు తరలి రా నుంది. మంజీరడ్యాం, ఘణపురం ఆనకట్టతో పాటు మధ్య లో ఉన్న నాలుగు ప్రధాన చెరువులు, 32 చెక్డ్యామ్లను గోదావరి జలాలతో నింపిన తర్వాత కాళేశ్వరం నీళ్లు 10 రోజుల సమయంలో నిజాంసాగర్ను ముద్దాడనున్నాయి.
సీఎం కేసీఆర్ కలలకు రూపం..
సీఎం కేసీఆర్ కలలకు రూపమే కాళేశ్వరం నీటి మళ్లింపు పథకం. కనీవినీ ఎరుగని విధంగా గోదావరి జలాలను నిజాంసాగర్కు మళ్లించిన ఘనత ఆయనకే దక్కుతుంది. వర్షాల కోసం ఎదురుచూపులు చూడకుండా నిజాంసాగర్ ప్రాజెక్టునే నమ్ముకొని రెండు పంటలను సాగు చేసుకుంటాం.
-బాగోమోల రాములు, రైతు, బుర్గుల్, నిజాంసాగర్
సాగు నీటికి ఇబ్బందులు లేకుండా..
నిజాంసాగర్ ఆయకట్టు కింద గు న్కుల్ శివారులో నాకు ఎకరం పొ లం ఉంది. ప్రతి యేడూ పంట చేతికి అందే దశకు వచ్చే సరికి నిజాంసాగర్లో నీరు అడుగంటిపోతున్నది. దీంతో వర్షాకాలంలో మాత్రమే సాగు చేస్తూ యాసంగిలో బీడుగా ఉంచేవాడిని. ఇక కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు వస్తున్నాయి కనుక రెండు పంటలు వేస్తా.
-సాయాగౌడ్, రైతు, సుల్తాన్నగర్, నిజాంసాగర్
ఇవి కూడా చదవండి
ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నా!
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్తో బోలెడు బెనిఫిట్లు!
దీదీ.. ముస్లిం ఓట్లను కోల్పోయింది: ప్రధాని మోదీ