ధర్పల్లి/ఇందల్వాయి/సిరికొండ/రెంజల్/మోర్తాడ్, ఏప్రిల్ 6 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. 45 ఏండ్లు నిండినవారికి వైద్య సిబ్బంది టీకా వేస్తున్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం 40 మందికి టీకా వేసినట్లు వైద్యుడు రఘువీర్ తెలిపారు. 12 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని పీహెచ్సీలో మొత్తం 64 మందికి టెస్టులు చేయగా, 19 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ శుభాకర్ తెలిపారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి మోహన్ తెలిపారు. 25 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించామన్నారు. రెంజల్ పీహెచ్సీలో 54 మందికి టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారిణి క్రిస్టీనా తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో నలుగురికి టెస్టులు చేయగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సుమంత్ తెలిపారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
నిజామాబాద్రూరల్/వర్ని/సిరికొండ/ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 6 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు వైరస్బారిన పడకుండా అవగాహన కల్పించాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లు సూచించారు. మండల పరిషత్ కార్యాలయాల్లో మంగళవారం మండల స్థాయి సిబ్బందితో వారు సమావేశాలు నిర్వహించారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఈ సమావేశాల్లో నిజామాబాద్ రూరల్ ఎంపీడీవో మల్లేశ్, తహసీల్దార్ ప్రశాంత్కుమార్, ఎంపీవో మధురిమ, వర్ని ఎంపీడీవో బషీరుద్దీన్, తహసీల్దార్ విఠల్, ఎస్సై అనిల్రెడ్డి, సిరికొండ ఎంపీడీవో లక్ష్మీప్రసాద్, తహసీల్దార్ అనిల్కుమార్, ఎస్సై రాజశేఖర్, వైద్యాధికారి మోహన్, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఎడపల్లిలో ఆయుష్ వైద్యాధికారి వెంకటేశ్, ఎంపీడీవో శంకర్, మండల వైస్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.
కరోనా బాధితులకు అండగా నిలిచిన సర్పంచ్
మోపాల్ (ఖలీల్వాడి), ఏప్రిల్ 6 : మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామానికి వలస వచ్చిన కుటుంబం కరోనాబారిన పడగా, ఇంటి యజమానికి ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బాధితులు గ్రామంలోని కంపోస్ట్ షెడ్డులో ఉన్నారు. విషయం తెలుకున్న సర్పంచ్ సిద్ధార్థ, వైద్యాధికారి నవీన్కుమార్, ఎంపీడీవో ఇక్బాల్, తహసీల్దార్ వీర్సింగ్ బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తాత్కాలికంగా మరో ఇంటికి వారిని తరలించి నిత్యావసరాలు, మెడికల్ కిట్లు అందజేశారు. ఏమైనా సమస్యలు ఎదురైతే ఫోన్లో సంప్రదించాలని సర్పంచ్ సూచించారు.