కామారెడ్డి టౌన్: జిల్లా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గోవర్ధన్ కోరారు. సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా పరిషత్ సమావేశం చైర్పర్సన్ శోభ అధ్యక్షతన జరిగింది. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, వైద్యం, విద్య, అటవీ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ, ఐసీడీఎస్ శాఖలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులలో జాప్యం జరుగుతుందని పలువురు జడ్పీటీసీలు విచారం వ్యక్తం చేశారు. కిందిస్థాయి అధికారులు ఉన్నత అధికారులను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ అన్నారు.
జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 100 శాతం పూర్తయ్యే విధంగా ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన సందర్భంగా కేకును కట్ చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దొడ్డు రకం వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు మాట్లాడుతూ 2021-22 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 82.94 పని దినాలు కల్పించి రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 80 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. ప్రజలకు కరోనా టీకాపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని సూచించారు . సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డీఎఫ్వో నిఖిత, సీఈవో సాయి గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.