కామారెడ్డి టౌన్: జిల్లాను సైబర్ నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం సైబర్ నేరాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి, కష్టార్జితాన్ని ఆన్లైన్లో పెట్టుబడిగా పెట్టవద్దని సూచించారు. అధిక లాభాలను ఆశించి మోసపోవద్దని కోరారు. మారుతున్న పరిస్థితులకను గుణంగా బ్యాంకు వారు ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేవైసీలను నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఖాతాదారుడు తన కేవైసీ వివరాలను బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
నేరగాళ్లు బ్యాంకు అధికారుల పేరిట ఫోన్ చేసి కేవైసీ వివరాలను సేకరించి ఖాతాదారుల నుంచి డబ్బులు స్వాహా చేస్తున్నారని పేర్కొన్నారు. కేవైసీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంటే ఆలస్యం చేయడకుండా డయల్ 155260,100 నంబర్లకు వెంటనే కాల్ చేసి వివరాలు తెలియచేయాలని సూచించారు. 24 గంటల లోపు ఫిర్యాదు చేసినట్లయితే పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.