దొంగతనాలు, కిడ్నాప్లకు పాల్పడుతున్న అగంతకులు
కాలనీల్లో నిత్యం అపరిచిత వ్యక్తుల సంచారం
ఇతర రాష్ర్ర్టాలకు చెందినవారే ఎక్కువ..!
కానరాని పోలీసు పెట్రోలింగ్
నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 11: నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. నేరాలకు పాల్పడే మాయగాళ్లు ఎక్కువవుతున్నారు.ఎక్కువగా జన సంచారం లేని కాలనీల్లో తిరుగుతూ తమకు కావాల్సిన సమాచారం సేకరించి సమయం చూసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన కొందరు కాలనీల్లో తిరుగుతూ వస్తువులు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నట్లు నటిస్తున్నారు. ఇదే క్రమంలో నేరాలకు ప్రణాళిక రూపొందించి రాత్రివేళల్లో నేరాలకు పాల్పడుతున్నారు. పెట్రోలింగ్ తగ్గిపోవడంతో అపరిచితులు నేరాలు చేస్తూ తప్పించుకుంటున్నారు. ఇటీవల మూడో టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళలు ఓ వృద్ధురాలి వద్ద ఉన్న చిన్నపాపను కిడ్నాప్ చేయడానికి యత్నించారు. కాలనీవాసులు అప్రమత్తంగా ఉండడంతో అపరిచిత మహిళలు తప్పించుకొని పారిపోయారు. ఇలా ప్రతి రోజు కాలనీల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు.
ప్రజలకు పోలీసు శాఖ సూచన
ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్ఏక్మాల్ తదితర వస్తువులు విక్రయించే వారిపై కాలనీవాసులు నిఘా పెట్టాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. జన సంచారం ఎక్కువగా లేని ప్రాంతాల్లోనే దొంగతనాలు, కిడ్నాప్లకు పాల్పడడానికి మాయగాళ్లు తిరుగుతున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టడానికి ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఇటీవల నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొన్ని సూచనలతో ప్రకటన విడుదల చేశారు. కాలనీలో దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని, కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని, ఇంట్లో మహిళలు, వృద్ధులు అపరిచితుల సమాచారం పేరుతో వస్తే నమ్మవద్దని సూచించారు. శివారు ప్రాంత కాలనీల్లో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రివేళ చోరీలకు పాల్పడడం జరుగుతోందని, ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.
నిద్రపోతున్న పెట్రోలింగ్ వ్యవస్థ
నగరంలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని కాలనీల్లో పెట్రోలింగ్ తగ్గిపోయిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా నేరం జరిగితే డయల్ 100 లేదా పోలీసుస్టేషన్కు ఫోన్చేస్తేనే పోలీసులు వస్తున్నారని, మిగతా సమయంలో పెట్రోలింగ్ ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా పెట్రోలింగ్ వ్యవస్థ మరింత పటిష్టం చేయాలనే ఆలోచనతో ప్రతి పోలీసు స్టేషన్కు అదనంగా బ్లూకోట్స్ బైక్స్, ఇన్నోవా కారును కేటాయించింది. నగరంలో ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో గంటకు ఒకసారి పెట్రోలింగ్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా ఏ మాత్రం అమలు కావడం లేదు. కేవలం రాత్రి వేళ్లలో మాత్రమే పెట్రోలింగ్ కారు తిరుగుతోంది. పెట్రోలింగ్ వ్యవస్థ సరిగా పనిచేస్తే కాలనీలో అపరిచిత వ్యక్తులు నేరాలకు పాల్పడే అవకాశం లేదని, క్రైం రేట్ కూడా తగ్గే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అపరిచితులు కనిపిస్తే సమాచారం అందించాలి
నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఉద యం వివిధ వస్తువులు విక్రయించే వారిపై నిఘా పెట్టండి. కాలనీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీపంలోని పోలీసు స్టేషన్కు ఫోన్చేసి సమాచారం అందించాలి. తాళం వేసి ఊరికి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి.
–కార్తికేయ,నిజామాబాద్ పోలీసు కమిషనర్
ఇవి కూడా చదవండి
చిన్నారి చైత్ర వైద్యానికి సర్కారు సాయం
చిన్నారి చైత్ర వైద్యానికి సర్కారు సాయం