నిజాంసాగర్, ఏప్రిల్ 11: మండలంలోని ఒడ్డెపల్లి-జక్కాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో రూ.476.25 కోట్లతో చేపట్టనున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు మరో వారం రోజుల్లో చేరుకోనుండడంతో సీఎం నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు పరిసరాలను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు అతిథి గృహంలో భోజనం చేసి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం నాగమడుగు మత్తడి ప్రారంభించనున్నారని అధికారుల ద్వారా సమాచారం. బొగ్గుగుడిసె నుంచి నిజాంసాగర్ వరకు నాలుగు కిలో మీటర్ల రహదారిని నాలుగు రోజుల క్రితమే వేశారు. నిజాంసాగర్ నుంచి జక్కాపూర్ వరకు ఐదు కిలో మీటర్ల రహదారితో పాటు సుల్తాన్నగర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ గాంధీ చౌరస్తా నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు వరకు మూడు రహదారులను సైతం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద పెయింటింగ్, గార్డెన్లో మొరం, మూత్రశాలల నిర్మాణం తదితర పనులు కొనసాగుతున్నాయి. సీఎం రాకను పురస్కరించుకొని రహదారులతో పాటు ప్రాజెక్టు వద్ద మరమ్మతులు చేపడుతుండడంతో మండల ప్రజలతో పాటు ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.