నిజాంసాగర్, మే 21 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న దళితులకు దళితబంధు యూనిట్లను రెండో విడుత రెండు రోజుల కిందట పంపిణీ చేశారు. మొదటి విడుత 946 మంది లబ్ధిదారులకు అందజేయగా రెండో విడుత మరో 97 మంది లబ్ధిదారులకు కార్లు, ఆటోలను అందజేశారు. ప్రస్తుతం గ్రామాల్లోని దళితులంతా సంబురాల్లో మునిగి తెలుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మండలాన్ని దళితబంధు పైలట్ మండలంగా ప్రకటించడంతోపాటు దళితబంధు పథకం అందజేసిన దేవుడు కేసీఆర్ అని దళితులు కొలుస్తున్నారు. శనివారం మండలంలోని నర్సింగ్రావ్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే హన్మంత్షిండే చేతుల మీదుగా లబ్ధిదారులకు కారు తాళాలు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల పాలిట దేవుడని అన్నారు.
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని లక్షాధికారి నుంచి కోటీశ్వరులుగా దళితులు మారాలని కోరారు. మహ్మద్నగర్ గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, గోర్గల్ గ్రామంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతిదుర్గారెడ్డి, కొమలంచ గ్రామంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ దళితులకు అందజేసిన వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి వారికి తాళాలను అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, సొసైటీ చైర్మన్ వాజిద్అలీ, జిల్లా బ్యాంకు మాజీ డైరెక్టర్ మోహన్రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.