నిజామాబాద్, మే 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. సర్కారు కొలువు సాధించేందుకు లక్షలాది మంది యువత పోటీపడుతున్నారు. రెండు నెలలుగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయినా యువతలో తెలియని భయం నెలకొంటున్నది. ఏం చదవాలి? ఎలా చదవాలి? ఒత్తిడిని ఎలా జయించాలి? గమ్యాన్ని ఎలా చేరుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సదావకాశాన్ని కల్పిస్తున్నది. పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ, టీఎన్జీవో, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నేడు ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే సదస్సుకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కేఆర్ నాగరాజుతోపాటు ప్రధానవక్తలుగా వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలత హాజరుకానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆయా శాఖల్లో నోటిఫికేషన్లను జారీ చేసింది. దరఖాస్తులను సైతం ఆహ్వానించగా పలు నోటిఫికేషన్లకు చివరి తేదీ సైతం ముంచుకొస్తున్నది. టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో విడుదలైన ప్రకటనలకు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు లక్షలాది మంది నిరుద్యోగ యువత పోటీ పడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన వారంతా గడిచిన రెండు నెలలుగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
కసితో చదివి సిలబస్పై పట్టు సాధించడంతోపాటు పోటీపరీక్షల్లో కాసింత మెళకువలను తెలుసుకుంటే ఇట్టే రాణించేందుకు వీలుంటుంది. మొదటిసారి ఉద్యోగ పరీక్షలను ఎదుర్కొనే వారిలో తీవ్రమైన భయాందోళనలు ఉంటాయి. వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొని మరోసారి ప్రయత్నించే వారిలోనూ ఏదో తెలియని సందిగ్ధత ఉంటుంది. ఇలాంటి వారందరికీ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నది. నిష్ణాతులైన నిపుణులతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారికి అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల సన్నద్ధతపై నిపుణులు దిశా నిర్దేశం చేస్తారు.
యువతకు అండగా “నిపుణ”
మన రాష్ట్రం… మన పత్రిక నినాదంతో నిత్యం అక్షర యజ్ఞాన్ని కొనసాగిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(ఆంగ్ల పత్రిక) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ యువతకు మేలు చేయాలనే సంకల్పంతో దాదాపుగా దశాబ్ద కాలంగా కాంపిటేటివ్ మెటీరియల్ను శోధించి, క్రోడీకరించి యువతకు అందిస్తున్నది. తాజాగా ఏప్రిల్ 2 నుంచి నాలుగు పేజీల ప్రత్యేక సంచికతో నిపుణను అందిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. నిపుణలో రోజువారీగా అనేక అంశాలపై లోతైన విశ్లేషణ, పరీక్షల్లో అడిగే మాదిరి ప్రశ్నలు, జవాబులు చక్కగా వివరించడం ద్వారా అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. తెలంగాణలో నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతున్న ఈ సందర్భంలో యువతీ, యువకులకు మరింతగా లాభం చేకూర్చేలా పక్కా ప్లానింగ్తో పోటీ పరీక్షలను అభ్యర్థులు ఎదుర్కొనేలా అవగాహన సదస్సులు సైతం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే – నిపుణ నిర్వహిస్తున్నది.
నిజామాబాద్కు చెందిన జిల్లా పోలీసు శాఖ, టీఎన్జీవోస్, శ్రీవిష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ సదస్సుకు వేప అకాడమీ డైరెక్టర్ డా.సీఎస్ వేప, సీఎస్బీ ఐఏఎస్ అడాకమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత హాజరవుతున్నారు. వీరిరువురూ ఉద్యోగార్థులకు మెళకువలను నేర్పిస్తారు. భయాన్ని పోగొట్టి పోటీ పరీక్షల్లో ఒకడుగు ముందుకేసేలా తమదైన శైలిలో సలహాలు అందిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, సీపీ కేఆర్ నాగరాజు హాజరవుతున్నారు.
అన్ని సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలి..
ఏకాగ్రతతో చదువుకోవాలి. సంబంధిత మెటీరియల్ దగ్గర ఉంచుకోవాలి. ఇష్టమైన సబ్జెక్టుపై ఫోకస్ చేయకుండా అన్నింటిపై అవగాహన పెంచుకునేలా చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ బుక్లు తీసుకొని చదువుకోవాలి. గ్రూప్-1లో మెయిన్స్లో మల్టీపుల్ చాయిస్ ఉండవు. చేతిరాతను మెరుగుపర్చుకోవాలి. వేగంగా రాయడం అలవాటు చేసుకోవాలి. మెయిన్స్లో 10 మార్కులకు ఒక ప్రశ్న ఉంటుంది. కనీసం 7 నిమిషాల్లో జవాబు రాసేలా చూసుకోవాలి. నమస్తే తెలంగాణ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో నిపుణులు అందించే సూచనలను పాటించాలి.
–డాక్టర్ జయసుధ, జిల్లా పంచాయతీ అధికారి, నిజామాబాద్
ఫోబియాకు గురికావొద్దు..
ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో చదివి ఉద్యోగం సాధించాలి. ఎంతమంది రాసినా భయపడకుండా నాకే ఉద్యోగం వస్తుందని ఆలోచించాలి. ఫోబియాకు గురికాకుండా ఉండాలి. తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం అన్న భయం వదిలి చదువుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఎక్కువగా చదవాలి. రివిజన్ చేస్తూ ఉండాలి. సుమారు ఐదు న్యూస్ పేపర్లు చదవితే జనరల్ నాలెడ్జ్ వస్తుంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనుండడం అభినందనీయం.
– వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి..
క్రమశిక్షణతో పద్ధతి ప్రకారం చదువుకోవడంతోనే నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ను అయ్యాను. పోటీ ఎంత ఉన్నా విజయం మనదే అనేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సమయపాలన పాటిస్తే విజయం సొంతమవుతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. పౌష్ఠికాహారం తీసుకుంటూ సరిగ్గా నిద్రపోవాలి. నమస్తే తెలంగాణ నిర్వహించే అవగాహన సదస్సులో నిపుణులు సూచించే మెళకువలను పాటించాలి.
– డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్