కమ్మర్పల్లి, మే 18 : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణానికి చెందిన బీఎస్పీ ముఖ్య నాయకుడు గట్టు రతన్ రాజ్, అతడి అనుచరులు హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గాన్ని వందల కోట్ల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న రతన్ సింగ్, అతడి అనుచరులను అభినందించారు. కేసీఆర్, కేటీఆర్ నిరంతర కృషితో రాష్ట్రం అనతికాలంలోనే దేశంలోనే నంబర్వన్గా ఎదిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మానవీయ పథకాలు, చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పనులు కేసీఆర్ సీఎం కావడంతోనే సాధ్యమయ్యాయన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజక వర్గంలో కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ వైపు అడుగులు వేసిన యువత.. అదే స్ఫూర్తితో ప్రతిపక్షాల విష ప్రచారాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.