8 కళాశాలలకు రూ.1000కోట్ల కేటాయింపు
పరిశీలనలో కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానం, భిక్కనూర్ మండలంలోని భూములు
పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
కామారెడ్డి, మార్చి 12 : నాలుగు జిల్లాలకు కూడలిగా ఉన్న కామారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. కామారెడ్డి సహా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు తాజా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఈ సంవత్సరం కామారెడ్డితో పాటు ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాలల విషయంలో వీలైనంత త్వరగా భూసేకరణతో పాటు వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల వరకు భూమి అవసరమవుతుండగా, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంతోపాటు భిక్కనూరు మండలంలోని జంగంపల్లి సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మెడికల్ కళాశాలల కోసం రూ.1000కోట్లను కేటాయించారు. మరోవైపు ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త కళాశాలలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటన చేయగా, కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కామారెడ్డి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది. రెండేండ్లలో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 1800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభించే కళాశాలలకు సంబంధించి ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్కు దరఖాస్తులు పంపించారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది 8 కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఆ తర్వాత కామారెడ్డి సహా 7 కళాశాలలు రానున్నాయి. కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అనువుగా వసతులు, భూములు, అనుబంధ దవాఖానలు ఉన్నాయో గుర్తించాలని ఇప్పటికే వై ద్య అరోగ్యశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కళాశాలల ఏర్పాటు విషయమై జాతీ య వైద్య కమిషన్కు ప్రతిపాదనలు కుడా పంపించారు.
వచ్చే ఏడాది నుంచి ఏడు వైద్య కళాశాలలు ప్రారంభించాలని మొదట నిర్ణయించిన ప్రభుత్వం మరో కళాశాలకు అనుమతి ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో 8 వైద్య కళాశాలలు, ఆ తర్వాత మరో నాలుగు వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 8 వైద్య కళాశాలల పనులు జరుగుతుండగా ఈ ఏడాది కామారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రెండేండ్ల వ్యవధిలో 12 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడిక ల్ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేశారు.
భూసేకరణ, వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కళాశాలల విషయంలో వీలైనంత త్వరగా భూసేకరణతో పాటు వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల ప్రారంభించాలంటే దానికి అనుబంధంగా 330 పడకల దవాఖాన ఉండాలి. పడకల సంఖ్య పెంచడానికి అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నారు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన భూములు ఉన్నట్లు గుర్తించి ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా భిక్కనూరు మండలం జంగంపల్లి, బేసిక్ సమీపంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్లు కూడా గుర్తించారు. ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను పరిశీలించారు. అదే విధంగా భిక్కనూర్ మండల పరిధిలోని జంగంపల్లి, బేసిక్ ప్రాంతంలోని సౌత్ క్యాంపస్ వద్ద భూములను పరిశీలిస్తున్నారు.
నెరవేరనున్న జిల్లా ప్రజల కల..
కామారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరుపై ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ఏర్పాటు విషయమై భూసేకరణ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, డిగ్రీ కళాశాలలో 30 నుంచి 40 ఎకరాలు, అలాగే భిక్కనూర్ మండలం జంగంపల్లి పరిధిలో భూములు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలో కామారెడ్డి జిల్లా వాసుల కల నెరవేరనున్నదని పేర్కొన్నారు.