కామారెడ్డి, నవంబర్ 30 : కామారెడ్డి డీఎంహెచ్వో కార్యాలయం వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నది. రెగ్యులర్ డీఎంహెచ్వో కన్నా ఎక్కువగా ఇన్చార్జీల పాలనలోనే సాగుతున్నది. మూడున్నరేండ్లలో ముగ్గురు డీఎంహెచ్వోలు బదిలీ అయ్యారు. జిల్లాలో 22 మండలాల పరిధిలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 206 సబ్ సెంటర్లు ఉన్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది మధ్య గ్రూపు తగదాలు నెలకొన్నాయి. ఇన్చార్జీల పాలనతో ఇబ్బందులు తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం డీఎంహెచ్వోగా బాధ్యతలు స్వీకరించిన కల్పన కాంటే వైద్యశాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. కొన్నేండ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేయడం, కార్యాలయాలకు పట్టిన బూజు దులిపే ప్రక్రియ చేపట్టారు. స్టాఫ్ డిప్యుటేషన్లు రద్దు చేయడంతో పాటు పీహెచ్సీల ప్రక్షాళన, మెడికల్ ఆఫీసర్ల బదిలీలు చేపట్టడంతో మింగుడు పడని కొంతమంది అధికారులు, సిబ్బంది గ్రూపు తగాదాలకు ఆజ్యం పోశారనే విమర్శలు ఉన్నాయి. డీఎంహెచ్వోకు అనుకూలంగా కొందరు అధికారులు, సిబ్బంది.. వ్యతిరేకంగా కొంతమంది తయారయ్యారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది.
అంతా అస్తవ్యస్తం
కరోనాను పూర్తిగా అరికట్టడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా కొంతమంది అధికారుల తీరుతో ఇక్కడ మందకొడిగా సాగడం గమనార్హం. కామారెడ్డిలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే విమర్శలు రావడమే కాకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారుల బృందం సైతం పట్టుకున్నది. ల్యాబ్లలో దోపిడీ, అనుమతులు లేకుండా దవాఖానల నిర్వహణ, వైద్యశాలల అనుమతుల విషయంలో చేతివాటం ప్రదర్శించడంపై డైరెక్టర్ హెల్త్ నుంచి చివాట్లు సైతం పడ్డాయి. రెండు నెలల క్రితం డీఎంహెచ్వోగా హైదరాబాద్ నుంచి కల్పన కాంటే వచ్చిన నాటి నుంచి ప్రక్షాళన చేపట్టారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే సరెండర్ చేసి తిరిగి డిప్యూటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటైన 2016లో ఇన్చార్జిగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. 2017 మే నెలలో రెగ్యులర్ డీఎంహెచ్వోగా డాక్టర్ మధుశ్రీ బాధ్యతలు చేపట్టిన 6 నెలల వ్యవధిలోనే జిల్లా నుంచి వెళ్లిపోయారు. మళ్లీ చంద్రశేఖర్కే ఇన్చార్జి బాధ్యతలిచ్చారు. ఏడు నెలల క్రితం రెగ్యులర్ డీఎంహెచ్వోగా తుకారాంను జిల్లాకు కేటాయించినా విధుల్లో చేరకుండానే వెనక్కి వెళ్లిపోయారు. ఇటీవలే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డీపీఎం పద్మజ సొమ్మసిల్లి పడిపోయింది. డీఎంహెచ్వో వేధింపుల కారణంగానే జరిగిందంటూ కొంతమంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నతాధికారులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా వైద్యాధికారిణిగా ఉన్న కల్పన కాంటేను సరెండర్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.