నిజామాబాద్ లీగల్, జూన్ 15: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా వ్యక్తులు, సంస్థలు వ్యవహరించకుండా నిరోధించడానికి సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ‘ది సెక్సువల్ హరస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ప్లేస్ (ప్రివెన్షన్, ప్రోహిబిషన్, అండ్ రిడ్రెసల్) చట్టం-2013 రూపొందించారని తెలిపారు. జిల్లా జడ్జి సాయిరమాదేవి ఆదేశాల మేరకు మంగళవారం న్యాయసేవా సదన్లో ‘లైంగిక వేధింపులు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ ్య సముదాయాలు, దవాఖానలు తదితర విభాగాల్లో విధులు నిర్వహించే మహిళలకు వేధింపులు ఉండరాదని, వాటిని నిరోధించడానికి చట్టాన్ని రూపొందించారని తెలిపారు. కార్యాలయాల్లో అంతర్గత కమిటీలను నియమించాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశముందని తెలిపారు. మహిళలను ఏ రకంగానూ వేధించినా శిక్షార్షమేనని స్పష్టం చేశారు. సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి అధికారిణి ఝాన్సీరాణి మాట్లాడుతూ.. పదిహేను ప్రభుత్వ శాఖల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో మూడు (నిజామాబాద్, బోధన్, ఆర్మూర్) షీ టీమ్లను ఏర్పాటు చేసినట్లు మహిళా షీ టీమ్ జిల్లా ఇన్చార్జి మస్తాన్ అలీ తెలిపారు. న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, ఆశ నారాయణ, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదస్తు రాజారెడ్డి, షీ టీం సభ్యులు పాల్గొన్నారు.