కామారెడ్డి, మే 16: అకాల వర్షంతో ఉమ్మడి జిల్లాలో తీరని నష్టం వాటిల్లింది.సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దయ్యింది. పలుచోట్ల ఇండ్ల పైకప్పులు కూలడంతోపాటు వరిపైరు నేలవాలింది.చేతికి వచ్చిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులకు తీవ్రనష్టాన్ని మిగిల్చింది. అన్నదాతలు ఆందోళనకు గురికావొద్దని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షంతో సుమారు 221 కొనుగోలు కేంద్రాల పరిధిలోని 66,910 బస్తాల్లో ఉన్న 26,737 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మోపాల్ మండలంలో కురిసిన వర్షంతో ధాన్యం తడవడంతోపాటు పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. బలమైన గాలులకు చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. –