లింగంపేట, మే 7: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో రెండు జింకలను వేటాడిన ఆరుగురు నిందితులను పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్నారు. వారి నుంచి తుపాకీ, ఆయుధాలు, సెల్ఫోన్లతో పాటు జింకల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లింగంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి శనివారం వెల్లడించారు.
లింగంపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు శంకర్, రామ్మోహన్, హోంగార్డులు వసంత్, అర్జున్ శనివారం తెల్లవారుజామున పెట్రోలింగ్కు వెళ్లారు. పోల్కంపేట గ్రామం వైపు వెళ్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న రెండు కార్లను (ఏపీ 39 సీజే 4491, టీఎస్ 07 హెచ్టీ 1307) గుర్తించారు. పోలీసులు ఆ కార్లను పట్టుకోవడానికి ప్రయత్నించగా, ఎర్టిగా కారు ఐలాపూర్ గ్రామం వద్ద ఆగి పోగా అందులో నుంచి దిగి ఒకరు పారిపోయారు. కారును తనిఖీ చేయగా..రెండు చుక్కల జింకల కళేబరాలు కనిపించాయి. కారు వదిలిపారిపోయిన వ్యక్తిని పరిసరాల్లో గాలించి పట్టుకొని విచారించగా, హైదరాబాద్కు చెందిన మహ్మద్ హమీద్ ఉజ్మాన్గా గుర్తించారు.
తనతో పాటు మరో ఐదుగురు ఎండీ ఓబైద్ ఖాన్, మీర్ ముస్తఫా అలీ, ఫరన్జాన్ గులాం హుస్సేన్, సయ్యద్ రాహిల్ అలియాస్ అబ్దుల్, మీర్ తయ్యబ్ అలీ కలిసి శుక్రవారం రాత్రి జింకల వేట కోసం లింగంపేట మండలానికి వచ్చినట్లు విచారణలో తెలిపారని ఎస్పీ వివరించారు. మహ్మద్ హమీద్ స్పోర్ట్స్ రైఫిల్తో జింకలను కాల్చి చంపగా, మిగిలిన వారు వాటిని ముక్కలుగా కోసినట్లు తెలిపారు. మహ్మద్ హమీద్ పోలీసులకు చిక్కగా, మరో కారు (టీఎస్ 07 హెచ్టీ 1307)లో ఐదగురు నిందితులు పారిపోయారని చెప్పారు. అయితే, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని పోలీసులను రంగంలోకి దించి రహదారులన్నీ దిగ్బంధించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో మాచారెడ్డి మండలంలోని ఫరీద్పేట గ్రామం వద్ద ఎండీ ఓబైద్ ఖాన్, మీర్ ముస్తఫా అలీ, ఫరన్జాన్ గులాం హుస్సేన్, సయ్యద్ రాహిల్ అలియాస్ అబ్దుల్, మీర్ తయ్యబ్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వీరు జింకలను వేటడానికి మండలంలోని ఒంటర్పల్లి గ్రామానికి చెందిన పాండు, బద్యాతో పాటు మరో వ్యక్తి సహకారం తీసుకున్నట్లు చెప్పారు. వారు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు ముస్తాపూర్ అటవీ ప్రాంతంలో చుక్కల జింకలను వేటాడినట్లు తెలిపారు. వన్యప్రాణుల వేటగాళ్లను సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్న ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్సై శంకర్, కానిస్టేబుల్ శంకర్, రామ్మోహన్, హోంగార్డ్స్ వసంత్రావు, అర్జున్ను ఎస్పీ శ్రీనివాస్రెడ్డి అభినందించారు. నిందితుల నుంచి స్పోర్ట్స్ రైఫిల్, మూడు లైవ్ బుల్లెట్లు, రెండు కార్లు, నాలుగు కత్తులు, సెర్చ్లైట్, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ఎండీ హమీద్ ఉజ్మాన్, మీర్ ముస్తాఫా, ఫర్జాన్ గులాం హుస్సేన్, సయ్యద్ రాహిల్ అలియాస్ అబ్దుల్, మీర్ తయ్యబ్ హైదరాబాద్కు చెందిన వారు కాగా ఓబిద్ ఖాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని జగన్నాథపురానికి చెందినవారని తెలిపారు. జింకల వేటగాళ్లను అటవీ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎస్సై శంకర్, ఎఫ్డీవో శ్రీనివాస్తోపాటు అటవీశాఖ అధికారులు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
నిందితులపై పలు జిల్లాల్లో ఉన్న కేసులపై ఆరా…
చుక్కల జింకలను చంపిన నిందితులు గతంలో వన్యప్రాణులను వేటాడారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసులు సేకరిస్తున్నారు. కరీంనగర్, కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో గతంలో వన్యప్రాణులను వేటాడడంతో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్లలో నమోదైన కేసులపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. కేవలం మూడున్నర గంటల వ్యవధిలోనే సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, రోడ్లను దిగ్బంధనం చేయడం ద్వారా వన్యప్రాణుల వేటగాళ్లను అరెస్ట్ చేశామని తెలిపారు.