రామారెడ్డి, మార్చి 6 : గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలకేంద్రంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. పలు వార్డులు, కాలనీల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఎమ్మెల్యేకు వివరించడంతో మిషన్ భగీరథ ఏఈ ని ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. పైఅధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని సర్పంచ్ సంజీవ్కు సూచించారు. రామారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. దవాఖానలో ఒకే ఏఎన్ఎం ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుపట్టికలో 23 మంది పేర్లు ఉన్నాయని, మిగతా సిబ్బంది ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ రోజు దవాఖానకు రాలేరని ఏఎన్ఎం సమాధానం చెప్పడంతో జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. దవాఖానను తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.
నామాల సుజాత – శంకర్ దంపతులు ఇటీవల మృతిచెందగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనాథగా మారిన చిన్నారికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం ఉష్కె రాజయ్య, ఆర్ఎంపీ కందుల లింబాద్రి కుమారుడు మృతిచెందగా వారి కుటుంబాలను పరిశీలించారు. అనంతరం కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను వివరించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, సర్పంచ్ సంజీవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు రవీందర్గౌడ్, మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్రావు, ఉపసర్పంచ్ పోతునూరి ప్రసాద్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు రజితా రాజేందర్గౌడ్ తదితరులు ఉన్నారు.