లింగంపేట / కామారెడ్డిరూరల్/ సదాశివనగర్ /బీబీపేట్, జూన్ 8: లింగంపేట మండలకేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి సాయిరమేశ్గౌడ్ రెండో రోజైన మంగళవారం తనిఖీ చేశారు. మండలకేంద్రంలోని కృష్ణ, వీరభధ్ర, ఆగ్రోస్, గురునానక్ విత్తన విక్రయ దుకాణాల ను తనిఖీ చేశారు. వానకాలం సీజన్లో రైతులకు విక్రయించడానికి తీసుకువచ్చిన విత్తనాలు, ఎరువులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని షాపుల నిర్వాహకులకు సూచించారు. ప్యాకింగ్ తీసిన విత్తనాలు, గడువు ముగిసిన విత్తనాలను విక్రయించవద్దన్నారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్లో టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేపట్టారు. పట్టణంలోని పలు దుకాణాల్లో ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపులకు సంబంధించిన రిజిస్టర్లు, స్టాక్ను పరిశీలించారు. దుకాణాల ఎదుట స్టాక్, ధరలు, విత్తనాల వివరాలను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ అధికారులు రత్న, యాదగిరి, మధుసూదన్రెడ్డి, కామారెడ్డి ఏవో శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండల కేంద్రంతోపాటు పద్మాజివాడి ఎక్స్ రోడ్డులోని విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి మంగళవారం తనిఖీ చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేసి దుకాణాలను సీజ్చేస్తామని హెచ్చరించారు. విక్రయాలకు సంబంధించిన బిల్లులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో గిర్దావర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్సై శంకర్, ఏఈవోలు స్నేహలత గౌడ్, శిరీష, హారిక, కవిత, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండలకేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను ఎస్సై మహేందర్ ఇన్చార్జి ఏవో పవన్కుమార్, నాయబ్ తహసీల్దార్ అనూషతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, విక్రయాలకు సంబంధించిన రసీదులను తప్పకుండా ఇవ్వాలని సూచించారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తే పీడీయాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.