ఖమ్మం రూరల్, జూన్ 20: పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా పంచాయతీని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించి ఆశించిన స్థాయిలో లక్ష్యాలను సాధించడంలో విఫలమైన ఎంపీవో, పంచాయతీ ప్రత్యేకాధికారి పీవీఎల్ శాస్త్రి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ ఎస్.గోపాల్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావును ఆదేశించారు. ఇంటి నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులు, ఇతర రికార్డులను పరిశీలించిన కలెక్టర్.. ఎంపీవో శాస్త్రి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ పంచాయతీ తనిఖీకి వచ్చిన సందర్భంలో గ్రామ పంచాయతీ కార్యాలయ తాళం సంబంధిత అధికారుల వద్ద లేకపోవడంతో పంచాయతీ గుమస్తా వచ్చే వరకు కార్యాయం బయటనే కలెక్టర్ వేచి ఉన్నారు. 30 నిమిషాల తరువాత పంచాయతీ గుమస్తా వచ్చి తాళం తీశాడు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులన్నీ వంద శాతం సక్రమంగా నిర్వహించాలని, పారిశుధ్య పనులు నిరంతరాయమంగా జరగాలని, పచ్చదనం పెంపొందించేందుకు నాటిన ప్రతి మొక్కునూ సంరక్షించే బాధ్యతను కార్యదర్శితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలోని పల్లెలన్నింటినీ పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దాలన్నారు. ఇంకా పల్లె ప్రగతి పనులు పూర్తి చేయని గ్రామ స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి అజయ్ జిల్లాలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేయనున్న నేపథ్యంలో పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పెద్దతండా, ఏదులాపురం, గుదిమళ్ల, వెంకటగిరి, గుర్రాలపాడు పంచాయతీల్లో సత్వరం సెగ్రిగేషన్ షెడ్ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తహసీల్దార్ను ఆదేశించారు. డీపీవో ప్రభాకర్రావు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీవో, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.