నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 30: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో చాలా పీహెచ్సీల్లో ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మోస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మోపాల్ పీహెచ్సీలో 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్య సిబ్బంది తెలిపారు. వర్ని సీహెచ్సీలో పది మందికి పరీక్షించగా.. ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ల సంఖ్య నిల్గా మారింది. రెండు రోజులుగా ఒక్కొక్కటి మాత్రమే వచ్చినా, ఆదివారం నాడు ఏ ఒక్క పాజిటివ్ కేసు రాకపోవడంతో వైద్యాధికారులు, సిబ్బంది, పలు శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 12 మందికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏడుగురికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్గా వచ్చింది. ఎడపల్లి పీహెచ్సీలో 8 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. బోధన్ మండలంలోని సాలూర చెక్పోస్ట్ వద్ద ఆదివారం ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు కూడా నెగెటివ్ వచ్చిందని డాక్టర్ రేఖ తెలిపారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి చెక్పోస్టు వద్ద ఆదివారం 25 మందికి కొవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా.. అందరికి నెగెటివ్ వచ్చిందని మండల వైద్య సిబ్బంది తెలిపారు. భీమ్గల్ పీహెచ్సీలో ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. కమ్మర్పల్లి మండలంలో చౌట్పల్లి పీహెచ్సీలో 10 మందికి టెస్టులు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. కమ్మర్పల్లిలో 13 మందికి టెస్టులు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.