బాన్సువాడ, మార్చి 30: పల్లెల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయి. బంగారు తెలంగాణ సాధనలో కీలకమైన గ్రామాల ముఖచిత్రాలు మార్చేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలుచేస్తున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులపై గ్రామ ప్రజలు, పంచాయతీ నిర్ణయం తీసుకొని ఖర్చుచేసుకునే వీలు కల్పిస్తున్నట్ల ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు పాలకవర్గాల్లో సరికొత్త జోష్ను నింపనున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పాలక వర్గాలు గ్రామ సభలో ఆమోదం పొందితే చాలు ఖర్చుచేసే అధికారాన్ని పంచాయతీలకు కట్టబెట్టింది. దీంతో రాబోయే రోజుల్లో పల్లెల్లో అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కనుంది. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని చెప్పిన మహాత్ముడి మాటలను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు.
ఒకవైపు రాష్ట్ర సాధన అనంతరం పల్లెల్లో ప్రజలు కోరుకున్న పాలనను సీఎం కేసీఆర్ పల్లె ముంగిట్లోకి తెచ్చేలా అనేక వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు కొత్త అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామ పంచాయతీ ఖాతాలోని నిధులను గ్రామ సభ ఆమోదంతోనే ఖర్చు పెట్టుకునే వెసులుబాటును కల్పించింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధికారుల అనుమతి నిబంధనలతో తలెత్తుతున్న జాప్యం, ఇబ్బందులు కొత్త నిబంధనల ఉత్తర్వులతో తొలగిపోనున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో ప్రజల జనాభాను బట్టి ప్రతినెలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తుంటాయి.
అభివృద్ధి పథంలో పంచాయతీలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామాల రూపురేఖలు మార్చేశాయి. గ్రామ పంచాయతీల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వన నర్సరీ, వైకుంఠధామం, ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు జరుగడంతో పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నాయి. గతంలో ప్రభుత్వం మంజూరు ఇచ్చిన నిధులు ట్రెజరీలో జమయ్యేవి. దీంతో పంచాయతీలకు చేరడంలో జాప్యం నెలకొనేది. దీనిని నివారించేందుకు పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిధులను ఖర్చు చేసే విషయంలోనూ ఎదురవుతున్న ఆటంకాలను ప్రభుత్వం గుర్తించింది. మైనర్ పంచాయతీల్లో సివిల్ పనులకు రూ. లక్ష, మేజర్ పంచాయతీలకు రూ. రెండు లక్షలు ఖర్చు చేసుకునే అధికారం ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువగా నిధులు ఖర్చు చేయాల్సివస్తే పంచాయతీ అధికారులు, ఆపై కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనిస్థానంలో ఇకనుంచి నిధుల మంజూరులో పంచాయతీలకు ఇబ్బందులు కలుగకుండా అధికారుల అనుమతులకు ప్రత్యామ్నయంగా ఆ అధికారం పంచాయతీలకు కట్టబెట్టింది. దీనిపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా జీవోను విడుదల చేశారు. దీని ఆధారంగా గ్రామ పంచాయతీలకు అభివృద్ధి పనుల కోసం గ్రామ సభలో ఆమోదం పొంది, పాలక వర్గాలే నిధులు ఖర్చు చేసుకోవచ్చు.
చాలా మంచి నిర్ణయం ..
గ్రామసభ తీర్మానంతో నిధులు ఖర్చు చేసుకునే ఆధికారం పంచాయతీలకే కల్పించడం చాలా మంచి నిర్ణయం. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచా రం , మంత్రి ఎర్రబెల్లికి ధన్యవాదాలు. ఈ విధానంతో అభివృద్ధి పనుల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురుకావు. గ్రామస్తుల అభీష్టం మే ర కు పాలక వర్గాలు కావాల్సిన పనులకు నిధులు ఖ ర్చు చేయాల్సి ఉంటుంది. ఆ అధికారం పాలక వర్గాలకు అప్పగించడంతో అధికారులతో తీసుకోవాల్సిన అనుమతుల నిబంబంధనల కొర్రి అడ్డు తొలగింది.