నిజాంసాగర్, మార్చి 30 : ఊరిలో ఎక్కడా చెత్తాచెదారం కనిపించకుండా పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం ట్రాక్టర్ అందజేయగా జీపీ సిబ్బంది నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్కకూ ట్యాంకరు ద్వారా నీటిని అందిస్తూ వాటిని బతికించుకుంటున్నారు. కొత్త పంచాయతీ అయినా అభివృద్ధిలో దూసుకుపోతున్నది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామం. నిజాంసాగర్ మండలంలో ఇటీవల నూతనంగా పది తండాలు పంచాయతీలుగా మారాయి. వాటిలో గోర్గల్ గ్రామం కూడా ఉంది. కొత్త పంచాయతీ అయినప్పటికీ ఇతర గ్రామాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నది. మండలంలో వైకుంఠధామం నిర్మాణ పనులు మొదటగా ఈ గ్రామంలోనే పూర్తయ్యాయి. జిల్లాలో వైకుంఠధామం పూర్తయిన రెండో గ్రామం కూడా ఇదే. ఇక కంపోస్టు షెడ్డు జిల్లాలోనే మొదటగా పూర్తిచేసుకోగా పీడీ చంద్రమోహన్రెడ్డితో పాటు అధికారులు గ్రామాన్ని సందర్శించి సేంద్రీయ ఎరువు తయారీ గురించి మండల వ్యాప్తంగా సర్పంచులు, కార్యదర్శులకు ఇక్కడే అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రతీ రహదారిని సీసీతో నిర్మించారు. పాఠశాల, పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహారశాలను పూర్తి చేశారు.
రహదారికి ఇరువైపులా మొక్కలు, కంచెల ఏర్పాటు చేశారు. కంపోస్టు షెడ్డు, రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
అందరి సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నది. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాల నిర్మాణాలు గ్రామానికే వన్నె తెస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన పంచాయతీ అయినప్పటికీ జిల్లాలోనే వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు మొదటగా పూర్తయిన గ్రామం మాదే కావడం గర్వకారణం.
-దుర్గారెడ్డి, గోర్గల్
గ్రామ రూపురేఖలు మారాయి
పల్లె ప్రగతితో మా గ్రా మం ఎంతో మారింది. గ్రామస్తులకు అన్ని వసతులు కల్పించాం. ము ఖ్యంగా ఎంపీపీది మా గ్రామం కావడంతో మ రింత అధివృద్ధి దిశగా మా గ్రామం ముందుకు సాగుతున్నది. ప్రస్తుతం మా గ్రామంలో రహదారులు, తాగునీటితో పాటు మౌలిక వసతులకు ఇబ్బందులు లేవు.
-అంబవ్వ, గోర్గల్, సర్పంచ్