తల్లిదండ్రులకు వాట్సాప్
ద్వారా సమాచారం
కేంద్రాలకు చేరుతున్న పౌష్టికాహారం, ఇతర సామగ్రి
కరోనా కేసులు నియంత్రణలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను వచ్చేనెల ఒకటి నుంచి పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నది. అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యక్ష బోధన ప్రారంభించనున్నారు. ఇందుకోసం పలు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రాలకు మెడికల్ కిట్స్తో పాటు పౌష్టికాహారం, ఇతర సామగ్రి సరఫరా చేస్తున్నారు.
కోటగిరి ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలు కూడా పునఃప్రారంభం కానున్నాయి. అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ప్రత్యక్ష బోధన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంగన్వాడీ కేంద్రాలను శానిటైజ్ చేసి వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేంద్రాలకు మెడికల్ కిట్స్తోపాటు పౌష్టికాహారం సరుకులు, ఇతర సామగ్రి సరఫరా చేస్తున్నారు. సరుకులు సమకూర్చుకోవడం కోసం సెంటర్ల ఖాతాల్లో స్పెషల్ ఫండ్ నుంచి రూ.500 జమకానున్నాయి.
1500 అంగన్వాడీ కేంద్రాలు..
జిల్లాలో 1,350 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 135 మినీ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 1500 కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలల వయసు గల పిల్లలు 12,267 మంది, ఏడు నెలల నుంచి సంవత్సరం వయసు వారు 14,618, ఏడాది నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 46,728, మూడేండ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 49,122, మొత్తం 1,22,735 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గర్భిణులు 15,978 మంది, బాలింతలు 11,886 మంది ఉన్నారని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో 586 కేంద్రాలు, ఫ్రీ రెంటెండ్ భవనాలు 471, సొంత భవనాలు 443 కేంద్రాలు కొనసాగుతున్నాయి. మెయిన్ అంగన్వాడీల్లో 1,365 మంది టీచర్లు ఉండగా 28 ఖాళీలు ఉన్నాయి. మినీ అంగన్వాడీల్లో 135 మంది పని చేస్తుండగా 5 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 15,00 మంది ఆయాలు పని చేస్తుండగా 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రత్యేక కార్యక్రమాలు..
గ్రామ పంచాయతీ, అంగన్వాడీ సిబ్బంది సెంటర్లను శుభ్రం చేశారు.
తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా అంగన్వాడీల ప్రారంభ సమాచారం అందిస్తున్నారు.
స్టాక్ నిల్వలు, కావాల్సిన సరుకుల వివరాలు తెలపాలి.
ప్రాజెక్టు సెక్టార్ సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లలు సెంటర్లకు వచ్చేలా చూడడం.ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడం.
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పోషకాహార మాసోత్సవాలు చేపట్టాలి.
అంతకుముందే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలి.
కేంద్రాలు ప్రారంభంకాగానే పిల్లలు మాస్క్లు ధరిస్తూ, భౌతికదూరం పాటించేలా చూడడం.రోజూ నాలుగుసార్లు సబ్బుతో పిల్లలు చేతులు శుభ్రం చేసుకునేలా చూడడం.న్యూట్రీగార్డెన్స్పై దృష్టి పెట్టాలి.
ఇప్పటి వరకు ఇంటికే సరుకులు..
ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కేంద్రాలు కొనసాగుతాయి. కరో నా నేపథ్యంలో పిల్లలకు గుడ్లు, పాలు, బాలామృతం, పప్పు, బియ్యం, స్నాక్స్ ఇతరాత్ర సామగ్రి ఇంటికే సరఫరా చేశారు. బాలింతలు, గర్భిణులకు గుడ్లు, బియ్యం, నూనె, పప్పు, పాలు నెలవారీగా పంపిణీ చేశారు. కాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో సరుకులు సెంటర్లకు చేరుతాయి. ఆలోపు ఏమైనా సరుకుల కొనుగోలు కోసం సెంటర్ ఖాతాలో స్పెషల్ ఫండ్ నుంచి రూ.500 జమ చేయనున్నారు. ఇప్పటికే మెడికల్ కిట్స్, ఇతర సామగ్రి సరఫరా చేస్తున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నాం..
పునఃప్రారంభానికి అంగన్వాడీ సెంటర్లను సిద్ధం చేస్తున్నాం. ప్రత్య క్ష తరగతుల నేపథ్యం లో అన్ని ఏర్పాట్లు చేస్తు న్నాం. ప్రతీ సెంటర్ ఖాతాలో స్పెషల్ ఫండ్ నుంచి రూ. 500జమ అవుతున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కేంద్రాలకు సరుకులు సరఫరా చేస్తున్నాం.