కామారెడ్డి టౌన్, మే 28: వచ్చే వానకాలం సాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేదని కలెక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల అవసరాలపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు, ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ విష్ణువర్దన్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్క్ఫెడ్ మేనేజర్ జితేందర్తో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి సాగుకు సంబంధించి 33 వేల క్వింటాళ్లు అవసరం ఉండగా, 57 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కందులు, పెసర్లు, మినుములు తదితర విత్తనాలు 600 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తామన్నారు. 44,206 మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను, 14,893 మెట్రిక్ టన్నులు, డీఏపీ 5,458 మెట్రిక్ టన్నులకు గాను, 1,209 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 21,830 మెట్రిక్ టన్నులకు గాను, 6,320 మెట్రిక్ టన్నులు పొటాష్ 3,820 మెట్రిక్ టన్నులకు గాను, 875 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మిగతా ఎరువులు విడుతల వారీగా జిల్లాకు వస్తాయని తెలిపారు. నాసిరకం పత్తి విత్తనాల సరఫరాను అరికట్టడానికి రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు బృందాలతో కూడిన నాలుగు స్కాడ్స్ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు మాట్లాడుతూ.. జిల్లాకు ఏడువేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేశామని తెలిపారు. మరో నాలుగు వేల క్వింటాళ్లు రెండు మూడు రోజుల్లో సరఫరా చేస్తామన్నారు. సోయా విత్తనాలు మొలకలు 70 శాతం ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతనే విత్తుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పోసర్లు, బ్రోచర్లను ఆవిష్కరించారు.