బాన్సువాడ, మార్చి 27 : కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్తో శనివారం సమావేశం నిర్వహించి కరోనా వ్యాక్సినేషన్పై సమీక్షించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాన్సువాడ డివిజన్లోని 9 మండలాల్లో 45 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేయాలన్నారు. ప్రభుత్వ ఏరియా దవాఖానలో ప్రతిరోజూ 150 మందికి, పీహెచ్సీల్లో వంద మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. మెప్మా సిబ్బంది, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కొవిడ్ టీకాపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి
బాన్సువాడ డివిజన్లోని పిట్లంలో 2, బిచ్కుంద మండల కేంద్రంలో ఒక మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు, అర్హులైన వైద్యులు బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో లేదా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన..
సదాశివనగర్ మండలం పద్మాజివాడి, భూంపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతివనం, రోడ్డు వెంబడి నాటిన మొక్కలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. మొక్కలకు కంచెలను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంపై పద్మాజివాడి పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట సర్పంచులు కవిత, శంభు లలితాబాయి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో అశోక్, ఏపీవో పట్నం శ్రుతి, ఎంపీటీసీ సభ్యురాలు జూకంటి సుజాత పాల్గొన్నారు. గాంధారి మండలకేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్ను, కామారెడ్డి-బాన్సువాడ రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో నాటిన మొక్కలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. అనంతరం గాంధారి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీపీవో సాయన్న, ఎంపీపీ రాధాబలరాం, జడ్పీటీసీ శంకర్నాయక్, సర్పంచుల ఫోరం బండల అధ్యక్షుడు సంజీవ్, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.