బాన్సువాడ రూరల్, మార్చి 27 : హోలీ పండుగ రోజు ప్రజలందరూ చిన్నా పెద్దా తేడా లేకుండా వివిధ రకాల రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకొంటారు. వారం రోజుల ముందు నుంచే గ్రామాల్లో హోలీ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆడపడుచుల ఆటపాటలు, చిన్న పిల్లల జాజర ఆట పాటలు గ్రామీణ ప్రాంతాల్లో మార్మోగుతాయి. వసంత రుతువు ఆగమనానికి ఈ పండుగ చిహ్నం. ఈ రుతువులోనే చెట్ల ఆకులు రాలి కొత్త ఆకులు వస్తాయి. గతమెంతో ఘనంగా జరుపుకొనే ఈ పండుగ సంబురాలు నేడు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీనికి తోడు హోలీ సంబురాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. పండుగ రోజు సహజ సిద్ధమైన రంగులు కాకుండా రసాయనిక రంగుల వాడకంపై ప్రస్తుతం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనిక రంగులు వాడకంతో చర్మసంబంధిత వ్యాదుల బారిన పడే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆది, సోమవారాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యాయరు.
అన్ని వర్గాల ప్రజల ఆనంద హేలీ హోలీ..
హోలీ పండుగను అన్ని వర్గాల ప్రజలు అనందంగా జరుపుకొంటారు. పండుగ సందర్భంగా ఉదయం నుంచే ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ సంబురాల్లో పాల్గొంటారు. బావా మరుదులు, వదినా మరదళ్లు ఒకరికొకరు రంగులు చల్లుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. యువకులు గుంపులు, గుంపులుగా విడిపోయి రంగులు చల్లుకుంటారు. చిన్నపిల్లల సంబురం అంతా ఇంతా కాదు. పలు గ్రామాల్లో ఉట్టీని కట్టి దానిని పగులగొట్టేందుకు యువకులు పోటీ పడుతారు.
పండుగపై కరోనా ప్రభావం..
కరోనా వైరస్ విజృంభించడంతో హోలీ సంబురాలపై ప్రభావం పడింది. హోలీ పండుగ వచ్చిందంటే రంగులు చల్లుకునేందుకు వాడే వస్తువులు, రంగులు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలు రంగులు కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో దుకాణాలు వెలవెల బోతున్నాయి. సాధ్యమైనంత వరకు పండుగను సాదాసీదాగా జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవడం ఉత్తమమని వైద్యులు అభిప్రాయం.