నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మూడు రోజుల పాటు నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఒకే వేదిక మీదకు తేవడంతో విశేష స్పందన లభించింది. మూడు రోజుల్లో 60 ద్విచక్ర వాహనాలు, కార్లు అమ్ముడయ్యాయి. ప్రతి రోజూ వాహనాలు కొనుగోలు చేసిన వారి నుంచి లక్కీడ్రా నిర్వహించి సెల్ఫోన్ను బహుమతిగా అందజేశారు. పలువురు ప్రముఖులు ప్రదర్శనను తిలకించి మంచి ప్రయత్నమని అభినందించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ తదితరులు చివరి రోజు ప్రదర్శనను తిలకించారు.
ఖలీల్వాడి/ ఇందూరు, సెప్టెంబర్ 26: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో మూడు రోజులుగా కొనసాగిన నమస్తే తెలంగాణ,తెలంగాణ టుడే ఆటో షో కిక్కిరిసిన వాహన ప్రియుల సందడి మధ్య ముగిసింది. ఆదివారం కావడంతో ఉదయం నుంచే ఆటో షో ప్రాంగణం సందర్శకులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది సందర్శకులు వచ్చి కార్లు, ద్విచక్ర వాహనాల మోడళ్ల వివరాలు సేకరించారు. చాలామంది తక్షణమే వాహనాలు బుక్ చేసుకొని కొనుగోలు చేశారు. ముగింపు సందర్భంగా సందర్శకులతో స్టాళ్ల వద్ద సందడి కనిపించింది. కుటుంబాలతో కలిసి వచ్చి బైకులు, కార్ల టెస్ట్ డ్రైవ్లు చేస్తూ రుణ సదుపాయాలు, ప్రత్యేకతలపై ఆరా తీశారు. కొత్తకొత్త వాహనాలు, ద్విచక్ర వాహనాల మోడళ్లను ఆసక్తిగా తిలకిస్తూ కొనుగోలుదారులతో మూడు రోజులపాటు సందడి నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో జన సందడి కనిపించింది.
ప్రముఖుల సందర్శన..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షోను ఆదివారం పలువురు ప్రముఖులు సందర్శించారు. స్టాళ్లను పరిశీలించి, వాహనాల ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆటో షోను సందర్శించారు. వివిధ కంపెనీల డీలర్లు ఏర్పాటు చేసిన కార్లు, బైక్లను పరిశీలించారు. అనంతరం కొనుగోలుదారుల లక్కీడ్రాలో గెలుపొందిన మహ్మద్ అబ్దుల్ హైమద్కు ఫోన్ను, లక్కీ విజిటర్స్ స్వప్న, శ్రీరాంలకు బహుమతులను బాజిరెడ్డి గోవర్ధన్ అందజేశారు. ఆటో షోలో పాల్గొన్న షోరూముల నిర్వాహకులకు జ్ఞాపికలను అందజేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ ఆటో షోను సందర్శించి స్టాళ్లను పరిశీలించారు. నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి సతీమణి, మాజీ కార్పొరేటర్ విశాలినిరెడ్డి హాజరై ఎలక్ట్రిక్ బైక్ను నడిపారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సైతం ఆటో షోను సందర్శించి బైక్ నడుపుతూ అందరినీ అలరించారు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ ఆటో షోను పరిశీలించారు. అనంతరం వెస్పా బైక్ను నడిపారు.
ఒకే వేదికపై బ్రాండెడ్ కార్లు, బైక్లు
బ్రాండెడ్ కార్లు,బైక్లను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషకరం. రుణ సౌకర్యం కల్పించేలా బ్యాంకర్ల స్టాళ్లనూ ఏర్పాటు చేయడం అభినందనీయం. అన్నివర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమయ్యే వాహనాలతో ఆటో షో నిర్వహించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి ధన్యవాదాలు.
బాజిరెడ్డి గోవర్ధన్,టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే
చాలా బాగుంది..
అన్నిరకాల కార్లు, బైక్లు, ఎలక్ట్రిక్ బైక్లను ఒకే వేదికపైకి తీసుకురావడం చాలా బాగుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడం మంచి పరిణామం.
జగన్నాథం విక్రమ్,
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి
అద్భుత కార్యక్రమం..
నిజామాబాద్ నగరంతోపాటు జిల్లా ప్రజలకు అన్నిరకాల వాహనాలు అందుబాటులో ఉండేలా ఆటో షో నిర్వహించడం అభినందనీయం. ఒకే వేదికపై కార్లు, బైక్లు, ఎలక్ట్రిక్ బైక్లు ప్రదర్శించడం బాగుంది. దీంతో ప్రజల సమయం వృథా కాదు. అద్భుత కార్యక్రమాన్ని చేపట్టిన నమస్తే తెలంగాణకు అభినందనలు.
దండు నీతూకిరణ్, నగర మేయర్
శ్రమలేకుండా చేశారు..
ఆటో షో చాలా అద్భుతమైన కార్యక్రమం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఒకే వేదికపై అన్నిరకాల కార్లు, బైక్లు తీసుకొచ్చి ప్రజలకు శ్రమలేకుండా చేశారు. నచ్చిన వాహనం ఎంపిక చేసుకునేందుకు చక్కని అవకాశం కల్పించారు.
ప్రభాకర్రెడ్డి, నుడా చైర్మన్
ద్విచక్ర వాహనాలపై యువత ఆసక్తి..
కుర్రకారు జోరుగా కొత్త వాహనాలు నడిపారు. ఒకే వేదికపై అనేక మోడళ్లు కొలువుదీరడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాల్లో అత్యంత ఖరీదైన బైకులు, కార్లపై కూర్చొని యువత సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చిన వాహనాలను సొంతం చేసుకున్నారు. తక్కువ సమయంలో వాహనాలు ఎంపిక చేసుకునే అవకాశం కలిగిందని సందర్శకులు హర్షం వ్యక్తంచేశారు.
మొత్తం 60 వాహనాలు బుకింగ్
మూడు రోజుల పాటు నిర్వహించిన ఆటో షోలో మొత్తం 60 వాహనాలు బుకింగ్ అయ్యాయి. ప్రతి రోజూ వాహన కొనుగోలుదారుల లక్కీ డ్రాతోపాటు సందర్శకుల పేర్లతో లక్కీడ్రా నిర్వహించి బహుమతులు అందజేశారు. మూడు రోజులపాటు ఆటో షో నిర్వహించడంపై వినియోగదారులు, పలు కంపెనీల డీలర్లు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి రంగు ప్రవీణ్కుమార్, ఏడీవీటీ మేనేజర్ కడార్ల శ్రీకాంత్, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.