కామారెడ్డి టౌన్/గాంధారి, సెప్టెంబర్ 26 : అనుమానం పెనుభూతమైంది.. పెండ్లయిన నెల రోజులకే భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్లోని ప్రగతినగర్లో ఆదివారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు సుధారాణిని(22) కామారెడ్డి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఎర్రోళ్ల కిరణ్ కుమార్ ఇచ్చి గత నెల 27న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 14 లక్షల నగదు, కామారెడ్డిలో ఒక ప్లాట్, సుమారు 10 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. పెండ్లయిన రెండు రోజుల నుంచే కిరణ్కుమార్ సుధారాణిని అనుమానించడం మొదలు పెట్టాడు. అన్నదమ్ములు, ఇతరులు ఎవరితో మాట్లాడనిచ్చే వాడు కాదు. ఇటీవల ఒకసారి సుధారాణిని గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన సుధారాణి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో కిరణ్కుమార్ను మందలించారు. శనివారం కిరణ్కుమార్ సుధారాణి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయిని చూడక చాలా రోజులైంది. ఒకసారి వచ్చి వెళ్లండని ఫోన్ చేశాడు. దీంతో సుధారాణి తల్లిదండ్రులు హైదరాబాద్కు బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్లోని తన కూతురు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఇంటి తలుపులు వేసి ఉండడం.. పిలిచినా పలకకపోవడంతో పడుకున్నారేమోనని భావించారు. మూడు గంటల వరకు వేచి చూసి మరోసారి పిలిచారు. ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో కామారెడ్డిలోని తమ బంధువులకు సమాచారమిచ్చారు. రాత్రి 8 గంటలకు వారు హైదరాబాద్కు చేరుకున్నారు. అప్పటికీ తలుపులు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి చూడగా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గొంతు, కాళ్లు కోయడంతో రక్తపు మడుగులో పడి ఉన్న తమ కూతురును చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. భార్య గొంతుకోసి హత్య చేసిన కిరణ్ తాను కూడా ఎడమ చేయి, గొంతు కోసుకున్నాడు. వెంటనే కిరణ్ కుమార్ను దవాఖానకు తరలించారు. సోమవారానికి కిరణ్, సుధారాణిలకు పెళ్లి జరిగి సరిగ్గా నెల రోజులు అవుతుంది. నెల రోజులకే తమ కూతురిని పొట్టన పెట్టుకున్న కిరణ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమ్మాయి తరఫు బంధువులు కామారెడ్డిలోని ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. పంచనామా పూర్తయిన తరువాత సుధారాణి మృతదేహాన్ని నేరుగా కామారెడ్డిలోని కిరణ్ ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. పట్టణ సీఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవుని పల్లి పోలీసులు సుధారాణి ఇంటి వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు.