నిజామబాద్, కామారెడ్డి కలెక్టర్ల వెల్లడి
ఇందూరు/కామారెడ్డి టౌన్, మే 26 : ఈ నెల 28, 29 తేదీల్లో సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సినేషన్ వేసేందుకు వారి జాబితాను సిద్ధం చేయాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం సంబంధిత అధికారులతో నిజామాబాద్ కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కామారెడ్డిలోని జనహిత భవన్లో కామారెడ్డి కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్షాప్ డీలర్లు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్, అందులో పని సిబ్బంది, జర్నలిస్టులకు ఈనెల 28, 29 తేదీల్లో వ్యాక్సినేషన్ కోసం జాబితా సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పౌరసరఫరాల అధికారులు, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి వారి పరిధిలోని అర్హుల జాబితాను మండలాల వారీగా సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంటే మండలానికి రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలు, తక్కువగా ఉంటే రెండు, మూడు మండలాలకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశించిన ప్రొఫార్మాలో లబ్ధిదారులు, వారి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వైద్యసిబ్బందిని నియమించి ప్రశాంతంగా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలన్నారు. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు వారికి సమాచార శాఖ ద్వారా జారీచేసిన అక్రిడిటేషన్ కార్డుతో పాటు ఆధార్కార్డు జిరాక్స్ను వ్యాక్సినేషన్ సమయంలో సమర్పించాలన్నారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఏరియా దవాఖాన, దేవునిపల్లి, రాజీవ్నగర్ యూపీఎస్, కామారెడ్డి అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు. సెల్ కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు వెంకటేశ్వర్రావు, గోవింద్, రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటమాధవరావు, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీపీఆర్వో కొండల్రావు, జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
3,450 మందికి వ్యాక్సిన్..
ఈ నెల 28, 29వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలో 3,450 సూపర్ స్ప్రెడర్స్కు కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రేషన్ డీలర్లు, గ్యాస్ సరఫరా చేసే సిబ్బంది, డీలర్స్, ఫెర్టిలైజర్స్, పెట్రోల్ బంక్ సిబ్బంది, ఇన్పుట్ డీలర్లు, జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు.