ప్రమాదవశాత్తు అంటుకున్న ధాన్యం కుప్పలు
నిజాంసాగర్ మండలం మగ్ధుంపూర్లో 200.. ముప్కాల్లో 130 బస్తాలు అగ్నికి ఆహుతి
వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదంలో వరి కుప్పలు దగ్ధం
నిజాంసాగర్, మే 26: మండలంలోని మగ్ధుంపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ధాన్యం కుప్పలతో పాటు గన్నీ బ్యాగులు దగ్ధమయ్యాయి. సమీపంలో వరి నూర్పిళ్లు పూర్తయిన పంట పొలాల్లో కొయ్యలను కాల్చేందుకు నిప్పు పెట్టగా కొనుగోలు కేంద్రంలోకి నిప్పు రవ్వలు ఎగిసిపడి ధాన్యం కుప్పలు దగ్ధమైనట్లు సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. సుమారు 200 బస్తాల వరకు ధాన్యం కుప్పలు, సుమారు పది కట్టల గన్నీ బస్తాలు కాలిపోయాయని, ఈ విషయమై తహసీల్దార్కు సమాచారం అందించామని తెలిపారు.
ముప్కాల్లో..
ముప్కాల్ మే 26 : మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ముగ్గురు రైతులకు చెందిన 130 బస్తాల ధాన్యం కాలిపోయింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పక్కన ఉన్న పొలంలో పెట్టిన మంటలు చెలరేగి ధాన్యం సంచులకు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.