కామారెడ్డి టౌన్, జూన్ 25 : పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై, ప్రమాదం సంభవించినప్పుడు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై జిల్లాలోని అన్ని పరిశ్రమల సేఫ్టీ సిబ్బందికి అవగాహన కల్పించాలని కలెక్టర్ శరత్ అన్నారు. జాతీయ విపత్తుల భద్రత -హైదరాబాద్ బృందం వారు కలెక్టర్ను ఆయన చాంబర్లో శుక్రవారం కలిశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నేడు (శనివారం) భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి రోడ్డులోని ఎంఎస్ఎన్ లైఫ్ సైన్స్ ఇండస్ట్రీలో జాతీయ విపత్తుల భద్రతా బృందం- హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ, రక్షణ చర్యలపై నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ ప్రదర్శన నిర్వహించన్నుట్లు తెలిపారు.జిల్లాలోని పరిశ్రమలకు సంబంధించిన సేఫ్టీ సిబ్బంది కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. పోలీస్, మెడికల్, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, అంబులెన్స్ సిబ్బంది కూడా మాక్ ఎక్సర్సైజ్లో పాల్గొనాలని సూచించారు.