మద్నూర్, జూన్ 24 : వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీబాయి అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు మురికి కాలువలను శుభ్రం చేయించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కేసులు తగ్గినా ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. సర్పంచుల వినతి మేరకు అవసరమైన గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తామని, రోడ్లు లేని గ్రామాల్లో రోడ్లు వేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇటీవల కామారెడ్డికి వచ్చినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేశారని తెలిపారు.
నిధులు విడుదల కాగానే అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ఏడేండ్ల కాలంలో నియోజవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. సమావేశంలో జడ్పీటీసీ అనిత, తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దరాస్ సూర్యకాంత్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, ఏడీఏ ఆంజనేయులు, వ్యవసాయాధికారి రాజు, ఎంపీవో వెంకటనర్సయ్య, ట్రాన్స్కో ఏఈఈ అరవింద్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.