కామారెడ్డి టౌన్, జూన్ 24 : త్వరలో చేపట్టనున్న ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతం చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జూలై ఒకటి నుంచి 10వ తేదీ వరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సూచించారు. కలెక్టరేట్ మండల స్పెషల్ ఆఫీసర్లు, ఫారెస్టు అధికారులు, పంచాయతీ, ఉపాధి హామీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో గురువారం సమావేశం ఏర్పాటు చేసి హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. పక్కా ప్రణాళికతో అధికారులకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మండల అభివృద్ధి అధికారుల సమన్వయంతో ఎస్టిమేషన్, సాంక్షన్ ప్రకియ పూర్తి చేసుకోవాలని, పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్ల కో-ఆర్డినేషన్తో ఈ నెల 30వ తేదీలోగా గుంతలు తీయడం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 28వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. మండలాల వారీగా మొక్కలు నాటే ప్రాంతాలు, మొక్కలు నాటే సంఖ్యతోపాటు గ్యాప్ ఫిల్లింగ్, క్యాజువాలిటీ, ఫ్రెష్ ప్లాంటేషన్పై పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కావాలన్నారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు వివిధ కార్యాలయాలు, దవాఖానల ఆవరణల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, ఫారెస్ట్, డీఆర్డీ అధికారుల జాయింట్ సర్వేతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలన్నారు.
నాటిన మొక్కలకు కచ్చితంగా ట్రీ గార్డ్స్, పాదులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి మండల స్థాయిలో పల్లె ప్రకృతి వనం కింద పది ఎకరాల్లో ప్లాంటేషన్కు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం నిర్వహణ వివరాలను టీజీఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. సందేహాలకు హరితహారం కో-ఆర్డినేటర్ సురేందర్ను సంప్రదించాలని సూచించారు. మొక్కలు ట్రాన్స్పోర్ట్ చేసే విధానం, నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా అటవీ శాఖ అధికారిణి నిఖిత వివరించారు. సమావేశంలో జిల్లా అధికారులు, ఉపాధి హామీ ఏపీడీలు సాయన్న, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.