పిట్లం/నిజాంసాగర్, మే 23 : రెండో విడుత జ్వర సర్వే కొనసాగుతున్నది. పిట్లం మండలంలోని ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలో ఆరోగ్యశాఖ సిబ్బంది ఆదివారం జ్వర సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించారు. పలువురికి మందులను అందజేశారు. ప్రజలు వారి ఆరోగ్య వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన వారికి తెలియజేసి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గులాం హుస్సేన్ తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో కొనసాగుతున్న రెండో విడుత జ్వర సర్వేలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్ గౌడ్ పాల్గొన్నారు. జలుబు, జ్వరం ఉన్న పలువురికి మెడికల్ కిట్లను అందజేశారు. అంగన్వాడీ, వైద్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల సంఖ్య, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు అధికారులను సంప్రదించి మెడికల్ కిట్లను తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట అంగన్వాడీ కార్యకర్త లలిత తదితరులు ఉన్నారు.
ఐదో రోజు 27, 289 ఇండ్లల్లో సర్వే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడుత జ్వర సర్వే జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నది. ఐదో రోజైన ఆదివారం 790 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఆదివారం 27 వేల 289 ఇండ్లల్లో సర్వే చేపట్టారు. 341 మందికి మెడికల్ కిట్లను అందజేశారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో వైద్యారోగ్య, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు జ్వర సర్వే నిర్వహించారు.