ఇందూరు, మార్చి 24: 75 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో బుధవారం ఫ్రీడమ్ 2కే రన్ను నిర్వహించారు. రన్లో వివిధ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎంతోమంది ప్రాణత్యాగాలతో సిద్ధించిన దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఫ్రీడమ్ 2కే రన్ను కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, జిల్లా అటవీశాఖ అధికారి సునీల్, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత అనుకున్న రంగంలో స్థిరపడాలని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. 75 వారాల కార్యక్రమంలో భాగంగా మొదటి వారం ఫ్రీడమ్ రన్ను నిర్వహించినట్లు చెప్పారు. ఫ్రీడమ్ రన్ పూలాంగ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు సాగింది.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లత, చంద్రశేఖర్, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, నెహ్రూ యువకేంద్రం సమన్వయకర్త శైలి, కలెక్టర్, సీపీ, డీఎఫ్వో సతీమణులు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ఎన్సీసీ కెడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో ఉత్సాహంగా..
విద్యానగర్, మార్చి 24 : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో బుధవారం ఫ్రీడం రన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే జెండా ఊపి ప్రారంభించిన ఫ్రీడం రన్.. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు కొనసాగింది. రన్లో ఆర్డీవో శ్రీను, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, జిల్లా యువజన సంక్షేమ అధికారి దామోదర్రెడ్డి, ఆర్కే డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జైపాల్రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్, జిల్లా అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.